టీమ్ ఇండియా ట్రంప్ కార్డు, ప్రపంచ మేటి బౌలర్లలో ఒకే ఒక్కడిగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మకంగా అందించే మేటి క్రికెటర్ రేసులో ఉన్నాడు. వరుసగా ప్రతి మ్యాచ్ లో అదరగొడుతున్న బూమ్రాకి ఈసారి అవార్డు తప్పనిసరిగా వస్తుందని అభిమానులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. టీమ్ ఇండియా సాధించే ప్రతి విజయంలో బుమ్రా పాత్ర చాలా కీలకమనే సంగతి అందరికీ తెలిసిందే.
ఇంతకీ విషయం ఏమిటంటే… ఐసీసీ ప్రతిష్టాత్మకంగా అందించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2024) అవార్డు రేస్ లో బుమ్రా నిలిచాడు. అయితే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే, ఈ పురస్కారం కోసం తనతో పాటు ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) హ్యారీ బ్రూక్, జోరూట్ (ఇంగ్లండ్) పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉండగా ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన వారిలో బుమ్రా, రూట్, బ్రూక్, కమిందు మెండిస్ (శ్రీలంక) ఉన్నారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 టెస్టులాడి 30 వికెట్లు తీసుకుని ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. అలాగే 2024లో 13 టెస్టులాడిన బుమ్రా 71 వికెట్లు తీసుకుని అద్భుత ప్రదర్శన కనపరిచాడు. 14.92 సగటు, 30.16 స్ట్రయిక్ రేట్ తో అందరికన్నా ముందున్నాడు.
ఆస్ట్రేలియా సిరిస్ లో రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కావడంతో తనే కెప్టెన్ గా మారి జట్టుని విజయపథంలో నడిపించాడు. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో తనే కెప్టెన్ అవుతాడని, టీమ్ ఇండియాని ముందుకు నడిపిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.