- విడుదలైన బీఎస్ ఎఫ్ జవాన్ పుర్నమ్ కుమార్ షా
- గతనెల 22న డ్యూటీలో ఉండగా సరిహద్దులు దాటిన జవాన్
- వెంటనే అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు
- సాధారణంగా ఫ్లాగ్ మీటింగ్ తర్వాత విడుదల
- ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సాధ్యపడని ప్రయత్నాలు
- భారత్ ప్రయత్నాలకు స్పందించని పాక్ రేంజర్లు
- ఎట్టకేలకు నిన్నప్రయత్నాలు ఫలించి ఇవాళ ఉదయం విడుదల
పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న బీఎస్ ఎఫ్ జవాన్ పుర్నమ్ కుమార్ షా ఎట్టకేలకు విడుదలయ్యాడు. 21 రోజులు బందీగాఉన్న పుర్నమ్ ను పాకిస్థానీ రేంజర్లు అట్టారీ చెక్ పోస్టు దగ్గర మన అధికారులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుర్నమ్ ను ఉదయం పదిగంటలకు వదిలిపెట్టారు. 40 ఏళ్ల పుర్నమ్ కుమార్ గతనెల 23నపంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో సరిహద్దుల గస్తీ డ్యూటీలో ఉండగా పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్థాన్ లోకి అడుగు పెట్టాడు. ఈలోగా పెహల్గాం ఉగ్రదాడి జరగడం, భారత, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు కోలుకోలేనంతగా దెబ్బతినడంతో పుర్నమ్ విడుదల ప్రయత్నాలపై ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టలేకపోయింది.
జమ్ము కశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ రెండు దేశాల మధ్యా ఉన్న 3,323 కిలోమీటర్ల ఉమ్మడి భారత, పాకిస్థాన్ సరిహద్దును బీఎస్ ఎఫ్ దళాలు నిరంతరం పహారా కాస్తుంటాయి.పెట్రోలింగ్ లో అప్పుడప్పుడు ఇలా సరిహద్దులు దాటి ఆ దేశంలోకి అడుగులు వేయడం మళ్లీ ఫ్లాగ్ మీటింగ్ ద్వారా సమస్యను పరిష్కరించుకుని నిబంధనల ప్రకారం వారిని వెనుకకు పంపడం రెండు దేశాల మధ్యా ఎప్పటినుంచో కొనసాగుతున్న ఒక నిబంధన. కానీ పెహల్గాం దాడి తర్వాత ఇరు దేశాలు మాట్లాడుకున్నదే లేదు. పుర్నమ్ విడుదలకోసం బీఎస్ ఎఫ్ అధికారులు ప్రయత్నిస్తున్నాపాక్ రేంజర్లనుంచి స్పందన లేదు సరికదా సరిహద్దుల దగ్గర నిరసనల జోరు పెరగడంతో ఈ ప్రక్రియ సాధ్యపడలేదు.
బెంగాల్ లోని హుగ్లీకి చెందిన పుర్నమ్ విడుదల కోసం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. పుర్నమ్ ను సాధ్యమైనంత త్వరగా వెనుకకు రప్పించాలంటూ ఆకాంక్షని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు విడుదల కావడంతో మమత ఎక్స్ లో స్పందించారు. పుర్నమ్ భార్య ఏడునెలల గర్భవతి, పైగా ఏడేళ్ల కొడుకు కూడా ఉండటంతో ఆ కుటుంబం విమానంలో చండీగఢ్ చేరుకుని ఫిరోజ్ పూర్ వెళ్లి అక్కడనుంచి ఆతని విడుదలకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మొత్తం మీద కథ సుఖాంతం కావడంతో ఆ బీఎస్ ఎఫ్ జవాన్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. తన భర్త తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని, తన ఆందోళనను అర్ధం చేసుకుని సీఎం తనతో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారని పుర్నమ్ భార్య హర్షం వ్యక్తంం చేసింది.
రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, పరస్పర ఘర్షణల నేపధ్యంలో పుర్నమ్ ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెనక్కు రావడం గొప్పవిషయమేనని భారత అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.