కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో జరుగుతున్న పలు పనులపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులకు సంబంధించి అధికారులకు క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు లేఖ రాసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సీఆర్డీఏ అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. దీనికి ఎన్నికల కమిషన్ రిప్లై ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే టెండర్లు ఫైనలైజ్ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. అయితే, ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు మాత్రం ఈసీ అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో.. రాజధాని టెండర్ల ప్రక్రియకు.. ఆ కోడ్నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ ఈసీకి లేఖ రాశారు.
ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేసే అప్పులతో చేపట్టబోయే పనులకు సీఆర్డీఏ, ఏడీసీఎల్ గత నెల పెద్ద ఎత్తున బిడ్లు ఆహ్వానించాయి. వీటిలో చాలా పనులకు సంబంధించి గడువు ముగిసింది. మరికొన్ని బిడ్లను శుక్రవారం తెరవాల్సి ఉంది. బిడ్లను తెరిచి ఖరారు చేసే దశలో.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. దీంతో టెండర్ల ఖరారు, కొత్త టెండర్లు పిలిచే ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఈ నెలలోనే కాంట్రాక్టర్లను ఖరారు చేసి.. పనులు కూడా ప్రారంభించేందుకు సీఆర్డీఏ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
అయితే, మార్చి 3వతేదీ వరకు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం సమస్యగా పరిణమించింది. దీంతో రాజధాని అమరావతి పనుల రాధాన్యత నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడకుండా చూడాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి సీఆర్డీఏ అధికారులు లేఖ రాశారు. కేవలం పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలే కాబట్టి.. ఈసీ జారీచేసిన నియామాలను సడలించాలని కోరారు. అయితే, ఇప్పటికే మొదలైన టెండర్ల ప్రక్రియలో బిడ్లు తెరిచేందుకు మాత్రం ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇచ్చింది. అయితే, ఈ పనులకు సంబంధించి తాము రాసిన లేఖ పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అనుకూల నిర్ణయం తీసుకోవడంపై సీఆర్డీఏ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జోష్లోనే మరో రూ.40 వేల కోట్లకు సంబంధిన పనులను దశల వారీగా ప్రారంభించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. వీటికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరులోగా ఏపీ అసెంబ్లీ, సచివాలయం, ఐకానిక్ టవర్ల బిడ్లు తెరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతాన్ని వివిధ జోన్లుగా విభజించారు. ఆయా జోన్ల పరిధిలోని లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రెయిన్లు, ఇంటర్నెట్ తీగలు వేసేందుకు డక్ట్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే కాకుండా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస భవనాల్లో విద్యుత్, ప్లంబింగ్, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ వంటి పనులు చేపట్టనున్నారు. ఇక, ఇవి కాకుండా.. మిగిలి ఉన్న వరద నియంత్రణ పనులు, రోడ్లు, సైకిల్ ట్రాక్లు, పాదచారుల బాటల అభివృద్ధి, స్ట్రీట్లైట్లు అమర్చడం వంటి పనులకు సంబంధించి కూడా.. మొత్తం రూ.14,185 కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇందులో సీఆర్డీఏకు సంబంధించిన పనులు రూ.8,477.30 కోట్లు కాగా.. ఏడీసీఎల్కు సంబంధించిన పనులు రూ.6,397 కోట్లు. భారీ మొత్తంలో చేపడుతున్న ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించారు. మరోవైపు.. తొందరలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి తొలి విడద రుణం విడుదల అవుతుందని అధికారులు చెబుతున్నారు.