హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సంఖ్యా బలం లేకున్నా ఎంఐఎంకు పోటీగా దిగిన భారతీయ జనతా పార్టీ క్రాస్ ఓటింగ్పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ, బీజేపీ మాత్రం ఓ అడుగు ముందుకు వెసింది. కానీ, ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది.
ఇకపోతే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటింగ్కు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికీ ఓటు వేయొద్దంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సూచించారు. ఇదే అంశాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, ఎవరికీ ఓటు వేయబోమని కేటీఆర్ తెలిపారు. ఈమేరకు పార్టీ విప్ కూడా జారీచేస్తుందన్నారు. విప్ను ధిక్కరించి విప్ను ధిక్కరించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
అయితే, సంఖ్యా బలాన్ని పట్టి చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగానే జరగనున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు 110 ఉన్నాయి. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు. 3 డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికి ఎంఐఎం పార్టీ బలం 49 ఓట్లు. ఆ పార్టీకి 1 ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో, ఆ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. వాళ్ల గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలం 25 ఓట్లు. వారిలో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఇక, బీజేపీ పార్టీ బలం చూస్తే మొత్తం ఓట్లు 21 మాత్రమే. వారిలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే, బీజేపీ పోటీలో అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో పోటీ అనివార్యమయింది. అటు.. కాంగ్రెస్ పార్టీ బలం చూస్తే.. 14 ఓట్లు ఉన్నాయి. వారిలో ఒక రాజ్యసభ ఎంపీ, నలుగురు ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కు సపోర్టు చేయాలని నిర్ణయించింది. ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండటం.. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.
అయితే, గెలవడానికి అవకాశం లేకపోయినప్పటికీ చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. పైగా గెలిచే అవకాశం లేకపోతే ఎందుకు నిలబెడతామని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అంటే.. సీరియస్ గానే ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అంతర్గతంగా ఏమైనా ఆకర్ష్ ఆపరేషన్ ఏదైనా చేస్తున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఏం జరుగుతుందన్నది ఓటింగ్ రోజున తేలే అవకాశం ఉంది. ఎలాంటి ప్రయత్నాలు లేకపోతే మాత్రం.. మజ్లిస్ అభ్యర్థి సులువుగా గెలవడం ఖాయంగా కనిపిస్దోంది. మాములుగా అయితే బీజేపీ కన్నా మజ్లిస్ తో బీఆర్ఎస్ కు అనుబంధం ఎక్కువ. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయింది. అందుకే ఆ పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.