తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్ లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ అయిందని…పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్ నిర్ధారణ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ 95429 08025 నెంబర్ తో ఏర్పాటు చేశారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలెర్ట్ ప్రకటించారు.
ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి.
కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్..పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు.
ఈ ప్రాంతాల్లో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా.. వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వెల్లడించారు. ఆయా పౌల్ట్రీల నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), క్రోడిగుడ్లను కాల్చి వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 75 శాతం కోళ్లను కాల్చి వేసిన పౌల్ట్రీ యజమానులు…గడచిన ఐదు, ఆరు రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏయే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయింది సమాచారం తెలుసుకోవాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. ఇంకా మిగిలిన ప్రాంతాల కోళ్ల శాంపిల్స్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ లు రావాల్సి ఉంది.