విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.. అలాగే, కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, కొత్త రైల్వే జోన్ ప్రకటన తర్వాత ఓ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని రైల్వేలైన్ మొత్తాన్ని విశాఖపట్నం జోన్ కింందకు తీసుకువచ్చిన కేంద్రం.. అత్యంత కీలకమైన, విశాఖనుంచే రాకపోకలు సాగించే కేకే లైన్ విషయంలో మాత్రం ట్విస్ట్ చూపించింది. కేకే లైన్ను తూర్పు కోస్తా పరిధిలో నూతనంగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలోకి బదలాయించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఈ అంశం గురించి అవగాహన ఉన్న వాళ్లందరిలో తీవ్ర చర్చను లేవనెత్తింది. రైల్వేజోన్ను కేటాయించినట్లే కేటాయించి.. అత్యంత కీలకమైన, లాభదాయకమైన కేకే లైన్ను మాత్రం రాయగడ డివిజన్లో కలపడం సరైన నిర్ణయం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలు ఏంటీ కేకే లైన్?
అరకు.. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతం అనేది అందరికీ తెలిసిన విషయమే. అరకు వెళ్లే యాత్రికులకు రైలు ప్రయాణం మధురానుభూతిని అందిస్తుంది. పర్యాటకులను ఫిదా చేస్తుంది. విశాఖ నుంచి అరకు దాకా.. కొండలు, గుట్టలు, లోయలన్నీ దాటుకుని ఎటుచూసినా అడవి కనిపించే మార్గంలో టన్నెల్స్ గుండా సాగిపోయే ప్రయాణం అరకు పర్యటనలో ప్రత్యేకంగా నిలుస్తుంది. విశాఖపట్నం నుంచి మొదలయ్యే ఈ పర్యాటక రైలుమార్గం దాదాపు 120 కిలోమీటర్ల దాకా సాగిపోతుంది. ఈ రూట్లో నడిచే రైలుకు విస్టాడోమ్ కోచ్లు ఏర్పాటు చేయడం వల్ల టూరిస్టులకు మరిచిపోలేని అనుభూతిని మిగల్చడంతో పాటు.. అందరినీ ఆకర్షిస్తోంది. ఈ రైలు మార్గం ఇన్నాళ్ల పాటు వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ఉండేది.
విశాఖ డివిజన్కు ఆర్థికంగా నష్టం :
ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్రం ఆమోద ముద్ర వేయడమే కాదు.. రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని రైలుమార్గం మొత్తం విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తెచ్చింది. అయితే, విశాఖ నుంచే రాకపోకలు సాగించే కీలకమైన కేకే లైన్ను మాత్రం తూర్పు కోస్తా పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ పరిధిలోకి మార్చేసింది. కొత్తవలస – కిరండోల్ లైన్లో భాగమైన అరకు రైల్వే స్టేషన్పై తెలుగువాళ్లకు ఎంతో ఎమోషనల్ టచ్ ఉంటుంది. అంతే కాదు.. కేకే లైన్ ద్వారా తూర్పు కోస్తా రైల్వే జోన్కి అత్యధిక ఆదాయం వస్తుంది. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేసినా, రాష్ట్రం మొత్తం ఈ జోన్ పరిధిలోకి తెచ్చినా.. కీలకమైన కేకే లైన్ లేకపోవడమంటే.. కొత్త రైల్వేజోన్లో ఉన్న విశాఖ డివిజన్కు మాత్రం ఆర్థికంగా నష్టమే అంటున్నారు.
కేకే లైన్ ద్వారా బహుముఖ ప్రయోజనాలు :
కొత్తవలస – కిరండోల్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ సాగిపోతుంది. మొత్తం 446 కిలోమీటర్ల మేర ఈ కేకే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో 58 ప్రాంతాల్లో కొండలను తొలిచి గుహల్లోంచి రైలు మార్గం నిర్మించారు. ఈ లైన్లో 48 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఛత్తీస్ గఢ్లోని బైలదిల్లా గనుల నుంచి, విశాఖ పోర్టు దాకా కేకే లైన్ ద్వారానే నిత్యం 10 నుంచి 12 వ్యాగన్ల ఐరన్ ఓర్ రవాణా జరుగుతుంది. ఈ ఐరన్ ఓర్ రవాణా వల్ల ప్రతియేటా దాదాపు రూ.10కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇక, గూడ్స్ రైళ్లు మాత్రమే కాకుండా.. విశాఖ నుంచి మూడు, రాయగడ నుంచి మరో మూడు ప్యాసింజర్ రైళ్లు ఈ కేకే లైన్లో నిత్యం నడుస్తాయి. ఇలా.. కేకే లైన్ ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కేకే లైన్ను విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందశ్వరి ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, అరకు రైల్వే స్టేషన్ను, కేకే లైన్ను విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కోరుతూ అరకు ఎంపీ తనుజారాణి కూడా వినతి పత్రం అందజేశారు. మరోవైపు వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా కేకే లైన్ను విశాఖపట్నం డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.