జాతి భావనకు తెలంగాణ తల్లి విగ్రహం జీవం పోసిందని డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రూపురేఖలతో తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం శాసనమండలిలో ఓ ప్రకటన ప్రవేశపెట్టారు. ఇది విగ్రహం మాత్రమే కాదని జాతి ఆత్మగౌరవ పతాకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అభివర్ణించారు. స్వేచ్ఛ కోసం పిడికిళ్ళఉ బిగించిన ఉత్తేజం, జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగం అన్నీ విగ్రహంలో కనిపిస్తాయని వెల్లడించారు. నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి అన్నారు. తెలంగాణ సాంప్రదాయలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలు పరిగణలోకి తీసుకొని నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగిందని డిప్యూటీ సీయం సభకు వివరించారు. ఇక తెలంగాణ తల్లి నిలుచున్న పీఠాన్ని మన చరిత్రకు ప్రతిరూపంగా రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ చిరునామా, ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్ళు బిగించామని డిప్యూటీ సీయం భట్టి శాసనమండలిలో చేసిన ప్రకటనలో విశదీకరించారు.