27.5 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

జోగి మౌనం వెనుక?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రి జోగి రమేష్ మౌనవ్రతం పట్టారు. మూడు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఒకసారి గెలిచి.. జగన్ కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో, ఇక మైలవరంలో జోగి రమేశ్ గెలుపు అసాధ్యమని భావించిన వైసీసీ అధ్యక్షుడు జగన్.. 2019 ఎన్నికల నాటికి ఆయన్ని పెడనకు షిఫ్ట్ చేశారు. 2009లో జోగి రమేశ్ కాంగ్రెస్ తరపున అదే పెడన నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకోగలిగారు. ఇక 2024 ఎన్నికల్లో అటు మొదటి సారి వైసీపీ నుంచి పోటీ చేసిన మైలవరం, రెండో సారి పోటీ చేసిన పెడన కాకుండా జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓడిపోయిన జోగి రాజకీయ భవితవ్వం ఏంటనేది ఆయనకే అర్థం కాకుండా తయారైందట. జగన్ ఆయనకు మూడు సార్లు మూడు చోట్ల నుంచి టికెట్ ఇచ్చినా ఒక్కసారే గెలిచిన ఆయన.. ఇప్పుడు పొలిటికల్‌గా క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డారు. ఓటమి తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జోగి అటు వైసీపీలో కొనసాగే పరిస్థితి లేక.. ఇటు కూటమి పార్టీల వైపు చూడలేక దిక్కులు చూడాల్సి వస్తుందంట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒకవైపు కుమారుడి అరెస్టు.. మరో వైపు జోగి రమేష్‌ను విచారణ పేరుతో రోజుల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పడం లాంటి పరిమాణాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. జోగి రమేష్ పొలిటికల్‌గా సర్వైవ్ కాలేక, ఇటు పార్టీలోనూ యాక్టివ్ అవ్వలేక సతమతం అవుతుండటంతో .. ఆయన భవిష్యత్తులో అయినా రాజకీయంగా యాక్టివ్ అవ్వడం కష్టమే అన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున నడుస్తోందంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమయం, సందర్భం లేకుండా అటు టీడీపీ, జనసేన పార్టీలను, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు జోగి రమేశ్. అంతేనా.. తన అనుచరగణంతో వెళ్లి ఏకంగా తాడేపల్లిలోని చంద్రబాబునాయుడు నివాసంపై దాడికి ప్రయత్నించారు. ఇక కోర్టు స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా తన కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.అప్పటి అరాచకాలకు సంబంధించి జోగి ఫ్యామిలీ విచారణలకు ఎదుర్కొంటూ కేసుల చట్రంలో ఇరుక్కుంది. ఏపీలో వైసీపీ ఓటమి తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ అధ్యక్షుడు జగన్ కంటే జోగి రమేష్ పొలిటికల్‌గా మొదట టార్గెట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని పల్లెత్తు మాట అన్నా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జోగి రమేశ్.. ఇప్పుడు కేసుల భయంతో అనూహ్యంగా సైలెంట్ అవ్వడంతో భవిష్యత్తులో అయినా జోగి రమేష్ అజ్ఞాతాన్ని వీడతారా, లేదా? అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. రెండు నియోకవర్గాలు మారి ఇప్పుడు సొంత నియోజకవర్గం అయిన మైలవరం వైసీపీ ఇంచార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టినా కూడా జోగి సైలెంట్ గానే ఉంటున్నారు. ఒక దశలో పార్టీ మారతారని ప్రచారం జరిగినా.. ఆయన ఖండించలేదు. అసలు మైలవరం సెగ్మెంట్‌లో బయట కనిపించడమే మానేశారు. జరిగింది ఏదో జరిగింది.. కేసులు అందరిపై నమోదు చేశారు. అలా అని సైలెంట్‌గా ఉంటే ఎలా అనే చర్చ వైసీపీలో నడుస్తోంది. కేసులు పెట్టిన తరువాత బయట అడుగు పెడితే మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకనే భావనలో ఉన్నారట జోగి. పార్టీ తరఫున మీడియా సమావేశం పెట్టమని అడిగినా నిరాకరిస్తున్నారట. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు తన వరకు వచ్చి తన మెడకు చుట్టుకోవడం, ఆ వివాదాన్ని టీడీపీ సెంటిమెంట్‌గా తీసుకోవడంతో.. అరెస్ట్ భయంతో పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు సైతం దూరంగానే ఉంటున్నారట. అసలే ఓడామన్న బాధ , రెండో వైపు చుట్టుముట్టిన కేసులు ఆయన్ను పొలిటికల్‌గా ఆందోళనకు గురి చేస్తున్నాయట. అసలే ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు ఎందుకు బయటకు రావడం అనుకుంటున్నారంట జోగి రమేష్. దాంతో, మైలవరంనియోజకవర్గంలో జోగి కనిపించక, నడిపించే నాయకుడు లేక పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన క్యాడెర్‌లో వ్యక్తం అవుతోంది. మొత్తానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా వెలుగొందిన జోగి మౌనం ఆ పార్టీ వారికే మింగుడు పడటం లేదంటున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com