తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో తాను లేనని కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏపీ సహా, తెలంగాణకు కొద్దిరోజుల్లో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని వస్తున్న వార్తలపై బండిసంజయ్ స్పందించారు. తాను రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తనకు అధ్యక్ష పదవి కంటే ఉన్నతమైన స్థానం అప్పగించిందని, ఆ బాధ్యతలు నిర్వర్తించడంలోనే తాను బిజీగా ఉన్నానని చెప్పారు. తనకు మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారనేది కేవలం ఊహాగానాలే అని బండి సంజయ్ కొట్టిపారేశారు. కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనకు, పార్టీకి రెండింటికి నష్టం చేయటం కోసమే కొంత మంది కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడి విషయంలో హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ్కి కొత్త అధ్యక్షుడిని నియమించే అంశంలో మొదటి నుంచీ సందిగ్ధత నెలకొంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించినప్పటినుంచీ ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, బీజేపీ అనవాయితీ ప్రకారం.. ఒక నాయకుడికి, ఒకే పదవి అని, మరో పదవి ఇవ్వొద్దని.. ఒకరు ఒకే పదవిని నిర్వర్తించాల్సి ఉంటుందని అధిష్టానం బండి సంజయ్నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు తొలగించింది. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు హడావుడిగా కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే. ఎన్నికల తర్వాత కూడా కిషన్రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేశారు. కానీ, లోక్ సభ ఎన్నికల తర్వాత కిషన్రెడ్డికి మళ్లీ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు. కానీ, ఆయన నుంచి ఇప్పటికీ అధ్యక్ష పదవిని మార్చలేదు.. ఆ స్థానంలో మరొకరిని కూడా నియమించడం లేదు. దీంతో.. ఇన్నాళ్లు బీజేపీ పాటించిన సంప్రదాయాన్ని పార్టీ స్వయంగా బ్రేక్ చేసిందా.. లేదా పార్టీని నడిపే సరైన నాయకులు దొరకటం లేదా.. లేక దొరికినా లోలోపల జరుగుతున్న కుమ్ములాటల వల్ల ఇవ్వకుండా తాత్సారం చేస్తుందా? అన్న చర్చ సాగుతోంది.