రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నూతన సేవలను అందించేందుకు ముందడుగు వేసింది. త్వరలోనే రైళ్లలో ప్రయాణిస్తున్నవారికి ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి రానుంది. సెంట్రల్ రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ముంబై – మన్మాడ్ మధ్య నడిచే పంచవటి ఎక్స్ప్రెస్ రైలులో మొదటి ఏటీఎంను ఏర్పాటు చేసింది.
ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు ప్రతి రోజూ నడిచే ఈ రైలు నాలుగు గంటల 30 నిమిషాల పాటు ప్రయాణం సాగుతుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎంను ట్రైన్ లోని ఏసీ ఛైర్కార్లో ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్న సమయంలో భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షట్టర్ డోర్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రయాణంలోనే డబ్బు విత్ డ్రా చేసుకునే వీలును కల్పించడం ఈ సర్వీస్ ప్రధాన లక్ష్యం. ప్రయోగం విజయవంతమైతే, మిగతా రైళ్లలోనూ ఈ సౌకర్యాన్ని అందించనున్నారు. రైళ్లలో ఈ సౌకర్యం రావడం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు.