30.8 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

జమ్మూకశ్మీర్‌లో జల్లెడ పడుతున్న సైన్యం

పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో అణువణువూ గాలిస్తున్నారు సైనికులు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు సైన్యం వేట సాగిస్తోంది. లోయలోని అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతోంది. పహల్గాం దాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దాడి జరిగిన క్షణం నుంచి వందల మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఆపరేషన్ ఏరివేత చేపట్టారు. బోర్డర్‌లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టారు. ఇటు చీమ అటు వెళ్లినా తెలిసేలా డేగ కళ్లతో పహారా కాస్తున్నారు.

ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో కూడా కొందరు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అలా వచ్చిన ఉగ్రవాదులను భారత్ సైన్యం తుపాకీ గుళ్లతో వాళ్లకు స్వాగతం పలికింది. బోర్డర్‌లోనే వాళ్లను మట్టుబెట్టి వారి వద్ద నుంచి పాకిస్థాన్‌కు చెందిన కరెన్సీ, మారణాయుధాలు స్వాధీనం చేసుకుంది. ఇలాంటివి మరిన్ని జరగొచ్చనే అంచనాలతో పూర్తి అలర్ట్‌గా సైన్యం ఉంది. గురువారం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. బసంత్‌ గఢ్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఓ ప్రాంతంలో ఎటాక్ చేసింది. ఈ టైంలో జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ అమరుడైనట్టు సైన్యం ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వచ్చే ప్రజలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని భద్రతా విభాగాలను అప్రమత్తం చేశారు. వచ్చే పోయే వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచిస్తున్నారు. బస్‌స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా భద్రత పెంచారు. హైదరాబాద్, తిరుపతి, ముంబై, చెన్నై ఇలా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు సాగుతున్నాయి.

ఉగ్రదాడిలో దోషిగా నిలబడ్డ పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు సిద్ధమవుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు లాంటి బోల్డ్ స్టెప్ తీసుకుంది. భారత్ తీసుకున్న మరో ఐదు కీలక నిర్ణయాలు పాకిస్థాన్‌కు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలోని పాకిస్తాన్ అత్యున్నత దౌత్యవేత్త సాద్ అహ్మద్ వారాయిచ్‌కు సమన్లు జారీ చేసింది. పర్సోనా నాన్ గ్రాటా నోట్‌ను అందజేసింది. 48 గంటల్లోనే దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలని మర్యాదగా చెప్పింది. ఓవైపు చర్యలు తీసుకుంటూనే దేశ భద్రత విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ చర్చలు జరుపుతోంది. భద్రతా విభాగాలు, రా చీఫ్, ఇతర ముఖ్యులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. ఇంకోవైపు అఖిలపక్ష సమావేశం కూడా జరుగుతోంది. అటు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశాల తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలు వెల్లడి అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com