నిన్నటి వరకు రెచ్చిపోయిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు బయటి నుంచి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు.. మరోవైపు ఇండియా ఆయన తీరును ఎక్కడికక్కడ ఎండ గడుతుంది. ఇప్పుడు సొంత దేశంలో కూడా ఆయనపై వ్యతిరేకత పెరిగిపోతుంది. కెనడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్సింగ్ ఇప్పుడు ఆయనపై తిరుగుబాటుకు పిలుపునిచ్చినట్టు కనిపిస్తోంది. ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతానని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ బహిరంగ లేఖను ట్విట్టర్లో రిలీజ్ చేశారు. కెనడా ప్రధానిగా ట్రూడో విఫలమయ్యారని అన్నారు జగ్మీత్ సింగ్. సామాన్యుల కోసం కాకుండ ధనిక వర్గాలకే ప్రస్తుత ప్రభుత్వంలో మేలు జరిగిందనేది ఆయన ఆరోపణ. అందుకే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్డీపీ సిద్ధంగా ఉందని ఆయన తన లేఖలో వివరించారు. కెనడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని పెడతామని చెప్పారు జగ్మీత్ సింగ్. తమ తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు ఇస్తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అంతం చేయొచ్చని అన్నారు.
నిజానికి ఇటీవలే కెనడా డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రిలాండ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రూడో కేబినెట్లో అత్యంత శక్తిమంతమైన మంత్రిగా ఆమెకు గుర్తింపు ఉండేది. ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆమె ఆరోపించారు. అయితే క్రిస్టియా ఫ్రిలాండ్ నిర్వహిస్తున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మారుస్తామని ట్రూడో ప్రకటించారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. క్రిస్టియా ఫ్రిలాండ్ మాత్రమే కాదు ప్రభుత్వంలో చాలా మంది ట్రూడోపై అసంతృప్తిగా ఉన్నారు. సరిహద్దులో వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను కట్టడి చేయాలని ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రూడో ప్రభుత్వానికి చేత కాకపోతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ చురకలు అంటించారు. ట్రంప్ ఇంతలా వార్నింగ్ ఇచ్చినా ట్రూడో స్పందించలేదని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. మరి దీని ఎఫెక్ట్ అవిశ్వాసతీర్మానంపై పడే అవకాశం లేకపోలేదు.
అయితే ఈ అవిశ్వాస తీర్మానం ఓ వ్యూహాత్మక ఎత్తుగడ అనే వాదనలుూ లేకపోలేదు. ఖలిస్థానీలతో ఇన్నాళ్లు అంటకాగిన ట్రూడో.. సరిగ్గా ఎన్నికల ముందు వారి నుంచి దూరం జరుగుతున్నట్టు నాటకమాడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఖలిస్థానీల దెబ్బతో ఇప్పటికే ట్రూడో పరువు అంతర్జాతీయంగా పోయిందనే చెప్పాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన భారత్పై ఆరోపణలు చేసి అబాసుపాలయ్యారు. అందుకే ఈ కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.