ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు అడుగడుగునా హార్థిక స్వాగతం లభిస్తోంది. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన భట్టి విక్రమార్క.. మొదటగా నరసింహపాలెంలో సిసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడినుంచి బుచ్చిరెడ్డి పాలెం బయలుదేరి వెళ్లారు. బుచ్చిరెడ్డిపాలెం చేరుకున్న డిప్యూటీ సీఎంకు గ్రామ నాయకులు, ప్రజలు, కాంగ్రెస్పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
గ్రామ శివారునుంచే గ్రామంలోకి పాదయాత్రగా వెళ్లారు భట్టి విక్రమార్క.. ఈ సందర్భంగా భట్టి వెంట గ్రామస్తులంతా ర్యాలీగా నడిచి వెళ్లారు. గ్రామంలోకి వెళ్లిన తర్వాత బుచ్చిరెడ్డి పాలెంలోని పలు వీధుల్లో సీసీరోడ్డు పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అందరూ వినియోగించుకోవాలని అప్పుడే, ఆ పథకాలు అమలు చేస్తున్నందుకు సార్థకత చేకూరుతుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గ్రామస్తులకు సూచించారు.
బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎర్రుపాలెం మండలం బనగండ్లపాడు గ్రామానికి వెళ్లారు భట్టి విక్రమార్క. అక్కడ కూడా గ్రామంలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం లభించింది. అధికారులతో పాటు.. గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నీరాజనాలు పలికారు.
గ్రామంలోకి ర్యాలీగా వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడు లో రూ. 1.56 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.