తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించనుంది. అయితే, ఈసారి రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్, యూనిక్ నెంబర్తో అందుబాటులోకి తేనున్నారు.
రాష్ట్రంలో 90లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే స్మార్ట్ కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కార్డు నమూనా అప్రూవల్ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ పంపించారు. ముఖ్యమంత్రి నుంచి అనుమతి రాగానే కార్డుల ప్రింటింగ్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తరువాత కోడ్ తొలగిపోతుంది. దీంతో.. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లబ్ధిదారులకు అందించే స్మార్ట్ రేషన్ కార్డుపై ఎవరి ఫొటో ఉండదని చెబుతున్నారు. కేవలం యూనిక్ నెంబర్తో పాటు ఏటీఎం కార్డు తరహాలో కార్డుపై చిప్తో ఉండేలా ఈ కార్డును తయారు చేస్తున్నారట. ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నెంబర్లు, అడ్రస్, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో స్మార్ట్ కార్డుతో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మీ సేవా ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అధికారులు ఎంపిక చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను కూడా పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన వారికి దశల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.