కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
కార్యకర్తల పోరాటం, కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మడం వల్లే మనం అధికారంలోకి వచ్చామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో ఆయన నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు స్వాగం పలికారు. అలాగే ఇప్పటి వరకూ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా పనిచేసిన దీపాదాస్ మున్షీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో 56వేల ఉద్యోగాలు ఇచ్చామని మహేష్ గౌడ్ తెలిపారు. అలాగే రైతు రుణమాఫీ కూడా ఏడాదిలో కేసీఆర్ పదేళ్ళలో చేసిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మన చేసిన కుల గణను ఇప్పుడు దేశానికి దశదిశగా మారిందన్నారు. వివాహం కూడా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి మనస్పూర్తిగా పని చేస్తున్న మహానాయకురాలు మీనాక్షి నటరాజన్ అని మహేష్ గౌడ్ కొనియాడారు. గతంలో మనకు ఎన్ని పాత అలవాట్లు ఉన్నా వాటిని విడిచి కొత్త అలవాట్లు చేసుకుని మీనాక్షి నటరాజన్ మాదిరి సింప్లిసిటీగా ఉండాలని పార్టీ కోసం నిరంతరం శ్రమించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.