తెలంగాణ రాష్ట్రం లై మ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీసు, క్వార్డజ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ నిక్షేపాలతో సమృద్ధిగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ కేంద్రంగా జరుగుతున్న మూడవ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 2014లో ఖనిజ ఆదాయం 1,958 కోట్ల రూపాయలు ఉండగా 2023 -24 నాటికి రూ.5,540 కోట్లకు ఆదాయం పెరిగిందని తెలిపారు. 2024-25 మరియు 2025- 26 సంవత్సరాల్లో లైమ్స్టోన్, మాంగనీస్ వంటి 32 పెద్ద ఖనిజాల బ్లాకులను వేలం వేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం సమావేశంలో వివరించారు.
ఈ 3వ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశం వంటి మహత్తర సమావేశంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సమావేశాన్ని నిర్వహించినందుకు గాను గౌరవనీయ కేంద్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. భారతదేశంలో ఖనిజ రంగం అనేది ఎంతో ప్రత్యేకమైనదని, ఎందుకంటే ఇది అనేక అవకాశాలను మన ముంగిట్లోకి తెస్తుందని అన్నారు. ఖనిజాలు అనేవి విలువైన ప్రకృతిసంపదలు.. అవి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముడిసరుకుగా ఉంటాయని, ఖనిజాల అన్వేషణ, అకర్షణ, నిర్వహణ అనేవి జాతీయ మరియు రాష్ట్ర లక్ష్యాల ప్రకారం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఖనిజాలు ఆర్థిక అభివృద్ధి యొక్క సమగ్ర వ్యూహంలో భాగస్వామ్యంగా ఉండి, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకు మరియు దిగుమతిపై ఆధారాన్ని తగ్గించేందుకు దోహదపడాలని తెలిపారు. ఆచార్య కౌటిల్యుడు, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో, తన అర్థశాస్త్రంలో, “ఖనిజ సంపదలు దేశం యొక్క శక్తి మరియు శౌర్యాన్ని సూచిస్తాయి” అని పేర్కొన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
ఖనిజాలు అనేవి మన రోజువారీ జీవితంలో ప్రధాన మరియు అవసరమైన ముడిసరుకులుగా ఉండి, ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక అభివృద్ధికి కీలకమైనవిగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,552 మైనింగ్, ఖనిజ గనుల లీజులు ఉన్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నదితీరంలోని మట్టి/మెట్ట ఖనిజాల కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పర్యావరణ మరియు ఇతర నియమ నిబంధనలకు అనుగుణంగా అనుమతి తీసుకుని ఇసుకను తవ్వడం, ప్రజలకు పారదర్శకంగా మరియు ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు.
2024లో సూర్యాపేట జిల్లాలో 2 లైమ్స్టోన్ బ్లాక్లను వేలం వేసి వాటిని దక్కించుకున్న బిడ్డర్లకు పత్రాలను జారీ చేసినట్టు తెలిపారు. చిన్న ఖనిజాల లీజుల మంజూరు విషయంలో, అవసరమైన అనుమతులతో కూడిన బ్లాక్ల వేలం విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఖనిజ వనరుల ఆడిట్ కోసం DGPS సర్వే, ETS సర్వే పూర్తయ్యాయన్నారు. అంతేకాదు.. పలు కీలక అంశాలపై పాయింట్ల వారీగా వివరాలు వెల్లడించారు.
IT వినియోగం:
1. OMEPPS ద్వారా ఆన్లైన్ మినరల్ ఈ-పేమెంట్ మరియు ఈ-పర్మిట్ వ్యవస్థ గత 10 సంవత్సరాల నుంచి అమలు అవుతోందని వివరించారు.
2. ఖనిజ రవాణా కోసం డీలర్ల ద్వారా ఆన్లైన్ ట్రాన్సిట్ పాస్లను జెనరేట్ చేయడం 9 సంవత్సరాలుగా అమలు చేస్తున్నామన్నారు.
3. ప్రభుత్వం నిర్మాణ పనుల్లో ఉపయోగించే రోడ్ మెటల్ వంటి ఖనిజాల కోసం జీరో పర్మిట్ విధానం గత సంవత్సరం నుంచి అమలు జరుగుతున్నట్టు తెలిపారు.
4. అపిల్ అప్లికేషన్లను ఆన్లైన్లో ప్రాసెస్ చేయడం మరియు త్వరితంగా పరిష్కరించడం కూడా గత సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని తెలిపారు.
5. TGeMining మొబైల్ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లు ఖనిజ రవాణా వాహనాలను చెక్ చేసే సౌలభ్యం ఉందని వివరించారు.
DMF (జిల్లా ఖనిజ ఫౌండేషన్):
2015 నుండి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశం ఖనిజ సంపదల అన్వేషణ, వినియోగం, అభివృద్ధి, మరియు ఖనిజ రంగంలో దేశ వ్యాప్తంగా ప్రగతి సాధించడంలో కీలకంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.