– జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశంలో ఆసక్తికర పరిణామం
– రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, అనుమతులు ఇప్పించండి
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి
– తెలంగాణ ప్రాజెక్టుల సమగ్ర జాబితా పేర్కొన్న డిప్యూటీ సీఎం
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. సోమవారం ఒడిశా రాష్ట్రం కోణార్క్లో జరుగుతున్న మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతులతో కూడిన లేఖను కిషన్ రెడ్డికి కోణార్క్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను మీ పరిశీలనకు, అవసరమైన చర్యలు తీసుకోవడానికి మీకు తెలియజేయాలని కోరుకుంటున్నానని ఆలేఖలో డిప్యూటీ సీఎం కోరారు.
1. ప్రాంతీయ రింగ్ రోడ్ (Regional Ring Road):
2016లో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును “సూత్రప్రాయంగా” ఆమోదించింది. 2022 జూలై 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభలో 350 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రస్తావించారు.
• ప్రాజెక్టు వ్యయం: ₹34,367.62 కోట్లు
• వివరాలు: ఉత్తర మరియు దక్షిణ కారిడార్లకు కేంద్రం ఆర్థిక ఆమోదం ఇప్పటికీ ఇవ్వలేదు. భూమి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
2. రేడియల్ రోడ్ అభివృద్ధి (Radial Roads Development):
హైదరాబాద్ మెట్రో కారిడార్లోని 10 కొత్త గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధి ద్వారా నగర విస్తరణకు ప్రణాళిక రూపొందించారు.
• ప్రాజెక్టు వ్యయం: ₹45,000 కోట్లు
3. మెట్రో రైల్ ఫేజ్-2 (Metro Rail Phase-II):
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి మొత్తం 76.4 కి.మీ మేర కొత్త కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించాము.
• ప్రాజెక్టు వ్యయం: ₹24,269 కోట్లు
4. మూసీ నది తీరాభివృద్ధి (Musi Riverfront Development):
మూసీ నదికి పునరుజ్జీవన ప్రాజెక్టు, బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.
• ప్రాజెక్టు వ్యయం: ₹14,100 కోట్లు
5. గోదావరి-మూసీ నదుల అనుసంధానం:
గోదావరి నుంచి 5 టీఎంసీ నీటిని మళ్లించి మూసీ నదిని శుద్ధి చేయడం.
• ప్రాజెక్టు వ్యయం: ₹7,440 కోట్లు
6. హైదరాబాద్ నగరానికి సీజంపి (CSMP):
హైదరాబాద్ నగరానికి 7,444 కి.మీ పొడవునా సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది.
• ప్రాజెక్టు వ్యయం: ₹17,212.69 కోట్లు
7. వరంగల్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రణాళిక:
రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరం వరంగల్ కోసం సమగ్ర డ్రైనేజీ ప్రణాళిక.
• ప్రాజెక్టు వ్యయం: ₹4,170 కోట్లు
8. బందర్ పోర్ట్ నుండి హైదరాబాదు డ్రై పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే:
బందర్ పోర్ట్ – హైదరాబాద్ మధ్య ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం.
• ప్రాజెక్టు వ్యయం: ₹17,000 కోట్లు
9. సింగరేణి బొగ్గు బ్లాక్ కేటాయింపు :
తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు కేటాయించాల్సిందిగా అభ్యర్థన.
10. సెమీకండక్టర్ మిషన్:
సెమీకండక్టర్ల తయారీ కోసం హైదరాబాదు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం.
మొత్తం వ్యయం: ₹1,63,559.31 కోట్లు
మీ సముచిత జోక్యంతో ఈ ప్రాజెక్టులకు మంజూరులను పొందడంలో రాష్ట్రానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఆ లేఖలో కోరారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.