ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడుగా ముందుకెళ్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయాలు కూడా దూకుడుగానే తీసుకుంటున్నారని చెబుతున్నారు. తాను చేయాలనుకుంటున్నవన్నీ ఏకకాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పురోగతిలో కూడా మరింత వేగం పెంచాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు, మంత్రి, తన కుమారుడు నారా లోకేష్కు పలు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకూ రాజకీయ అంశాలకు సంబంధించి ఆ ఇద్దరు నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ కాలం ముగిసింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది దగ్గరకొచ్చింది. అందుకే పాలనలో దూకుడు పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. ఈ వేసవి నుంచే సంక్షేమ పథకాల అమలు ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆయా పథకాలకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు కేంద్రంతో సమన్వయానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
మరోవైపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా దూసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వైసీపీ అధినేత జగన్.. ఈ కోణంలో తనదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. మరోవైపు.. కూటమి సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తోందంటున్నారు. అటు చూస్తే.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయంటున్నారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు పూర్తిస్థాయిలో రాజకీయ అంశాలపై దృష్టి పెట్టె పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. అందుకే జనసేన నుంచి పవన్ కల్యాణ్, టీడీపీ నుంచి తన కుమారుడు లోకేష్ రాజకీయ అంశాలకు సంబంధించి బాధ్యతలు చూసుకుంటారని సమాచారం.
ఇక, పవన్ కల్యాణ్ ఇప్పటికే వైసీపీ విషయంలో పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగన్ జనంలోకి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని జన సైనికులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. ఇటు.. మిత్ర పక్షం తెలుగు దేశం పార్టీతో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా పరిష్కార మార్గాలు ఉంటాయని, కానీ, జగన్మోహన్ రెడ్డికి మరోసారి చాన్స్ ఇస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కూడా పవన్ హెచ్చరించారని చెబుతున్నారు.
ఇదే క్రమంలో నారా లోకేష్ కూడా తెలుగు దేశం పార్టీ శ్రేణులను కట్టడి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. కూటమి సర్కారు ఏపీలో మరో 15 ఏళ్లపాటు కొనసాగాలని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారని, దానిని చెప్పే పరిస్థితి ఉండకూడదని లోకేష్ సైతం పార్టీ శ్రేణులను సర్దుబాటు చేస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది. ఎవరికి వాళ్లు.. తమ పార్టీ శ్రేణుల్లో సంయమనం పాటించేలా, కూటమికి బీటలు పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా జనసేనకు దూరమయ్యే పరిస్థితి రాకుండా ఉండేలా లోకేష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా.. ఎవరికివారుగా తమ పార్టీలను బలోపేతం చేస్తూనే.. సమన్వయంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ఈ విషయంలో చంద్రబాబు ఆ ఇద్దరు నేతలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. మరి.. ఈ వ్యూహం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.