మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డిని అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ మరో సారి ప్రయత్నిస్తోందని రాయచోటి మాజీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ తో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జగన్ మోహన్రెడ్డి హత్యా యత్నం మిస్ అయ్యిందని, ఈ సారి పక్కా ప్రణాళికతో ఆయన్ను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవెంకటేశ్వరరావు జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళడం దేనికి సంకేతమని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో ముందస్తు ప్రణాళికతో జగన్ పై హత్యాయత్నం చేశారని ఆ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో జగన్మోహనరెడ్డి పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా దాడి అని ప్రీ ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని చెప్పిదని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. గతంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వాడి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆయన వైఎస్ జగన్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ద్వేషం పెట్టుకునే ఏబీవెంకటేశ్వరరావు హత్యాయత్నం చేసిన వ్యక్తితో మంతనాలు చేస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో ఎలా చంపామో చెప్పిన వ్యక్తికి బెయిల్ తెప్పించి బయట తిప్పడం ఏంటో అర్ధం కావడం లేదని, మేమే చంపాము అని చంపిన వాళ్ళే చెప్పినా వారిని వదిలి పెట్టేసి ప్రమేయం లేని వారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో అంబెడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని… అంబెడ్కర్ ఆశయాలను నెమరువేసుకొని మంచి పాలన చేయాలని కోరుతున్నానని మాజీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
- Advertisement with us -