విగ్రహ ప్రతిష్టకు భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆదివారం ఆమె ప్రభుత్వ జీఓలను ధిక్కరించి జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్నే మేము ఆరాధిస్తామని ప్రకటించారు. ఆ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటామని చెప్పారు. జీఓలు, కేసులతో మమ్మల్ని భయపట్టలేరని అన్నారు. తెలంగాణ తల్లిలో ఉన్న బతుకమ్మను కాపాడుకుంటామన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామాల్లో ఎండగతామని కవిత తెలిపారు. నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రన ఇబ్బంది ఏమీ లేదని ప్రజలు, కార్యకర్తలు కేసీఆర్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను ఇంతకు ముందు కన్నా పటిష్టం చేస్తాం ఎమ్మెల్సీ కవిత అన్నారు.