తెలంగాణ ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి ఇది వర్తించనుంది. ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తున్న పద్ధతిని ఇకపై రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అమలు చేయనుంది. ఆస్తి పన్ను చెల్లింపులపై భారీ రాయితీని ప్రకటించింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద 90 శాతం వడ్డీ మాఫీతో ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే అవకాశం కల్పించింది.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంటి పన్ను బకాయిల్లో 50 శాతం వడ్డీ మాఫీ ప్రకటించగా… ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆస్తి పన్ను బకాయిల వడ్డీలో ఏకంగా 90 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 2024-25 యేడాదికి గానూ.. 90 శాతం వడ్డీ మాఫీతో ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించుకునే ఛాన్స్ కల్పించింది. ఈ పద్దతి ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే అమలు చేస్తోంది. ఈ అవకాశం ఇక అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకు.. అంటే, ఈనెల 31 వరకు ఆస్తి పన్నుతోపాటు వడ్డీ కేవలం 10 శాతం చెల్లించే వారికి ఈ ఛాన్స్ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్- అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని గృహ వినియోగదారులు అందరూ ఉపయోగించుకోవాలని కోరింది. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో వన్టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో చాలా వరకు బకాయిలు వసూలయ్యాయి. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.