రానున్న 40 రోజుల్లో తెలంగాణలో 2711 ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటినుంచే తెలంగాణలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరగలేదన్నారు. పదిహేను సంవత్సరాలుగా గ్రూప్ వన్ ఆఫీసర్ల నియామకాలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నియామకాలు జరగలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 563 గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి విజయవంతంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. 40 రోజుల్లో వీళ్ల నియామకాలు పూర్తవుతాయని రేవంత్ చెప్పారు. అలాగే, 783 గ్రూప్ టు పోస్టులు, 1365 గ్రూప్ 3 పోస్టులకు నియామకాలు చేయబోతున్నామన్నారు.
యూపీఎస్సీతో పోటీ పడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు. ప్రతిపక్షాలు చేయలేని పనిని తమ ప్రభుత్వం చేస్తుంటే.. ప్రశంసించాల్సింది పోయి.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.