తప్పిపోతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే…
- స్సింగ్ పర్సన్స్ ని ట్రేస్ చేసే విధానం అదరహో
- భూలా-భట్కా క్యాంపులు, ఖోయా-పాయా క్యాంపులతో పరిష్కారం
- ఎక్కడికక్కడ వాచ్ టవర్ల నిర్మాణం…
- డిజిటల్ టూల్స్, సోషల్ మీడియా సాయంతో వెతుకులాట
- క్రౌడ్ మేనేజ్మెంట్ కు కొత్త భాష్యం చెప్పిన ప్రయాగ్ రాజ్ కుంభమేళా
మహా కుంభమేళాలో తొలిరోజు ఏకంగా 250మంది తప్పిపోయారు. కన్నుమూసి తెరిచేలోగా ఆ జన ప్రభంజనంలో తప్పిపోతున్నారు. ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయి జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. అందరికీ పవిత్ర స్నానం త్వరగా ఆచరించి పూజలు చేసుకుని వెళ్లి పోవాలన్న తపనే. ఈ తపనలోనే తోపులాటలు కనిపిస్తున్నాయి. తమ వెంట వచ్చినవారు తప్పిపోయి జనంలో కలసిపోతుండటంతో చాలా మంది బిక్కమొహం వేస్తున్నారు. అయితే ఈ సమస్యలను యూపీ పోలీసులు క్షణాల్లో పరిష్కరిస్తున్నారు. మేళాలో తొలి గంటలో తప్పిపోయిన 250 మందిని క్షణాల్లో వాళ్ల బంధువుల దగ్గరకు చేర్చిన ఘనత యూపీ పోలీసులదే. దీనికి వాళ్లు ప్రత్యేకంగా ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు.క్రౌడ్ మేనేజ్ మెంట్ కోసం యూపీ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలను చేపడుతోంది.
భూలా -భట్కా క్యాంప్స్ పేరిట తప్పిపోయిన వారిని క్షణాల్లో వెతికి పట్టుకుని వారి సంబంధీకులతో కలపగలుగుతోంది. కుంభమేళాలో అనేక చోట్ల ప్రత్యేక వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఖోయా, పాయా అనే మరో పద్ధతిని కూడా అక్కడ అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా దారి తప్పిపోతున్నారు. వారందరినీ ఈ కేంద్రాల్లో ఉంచి క్షణాల్లో అనౌన్స్ మెంట్లు చేసి వారి వాళ్లని రప్పించి అప్పగిస్తున్నారు. దీనికోసం వారు అనేక ఆధునిక డిజిటల్ టూల్స్ ని, సోషల్ మీడియా సాయాన్ని తీసుకుంటున్నారు. ఘాట్ల దగ్గరున్న లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటిస్తూ తప్పి పోయిన వారిని వారి వారి సంబంధీకుల దగ్గరకు చేర్చుతున్నారు. తమ వారు కనిపించగానే తప్పి పోయిన వారు ఆనందంతో వాటేసుకుంటున్నారు. భాష రాని ప్రాంతంలో, ఎటెళ్లాలో తెలీని గందరగోళం, కొత్త ప్రాంతం కావడంతో చాలా మంది మొదట ఇబ్బందిపడినా వాలంటీర్లు వారి బాధను అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు.
అయినా కుంభమేళాలో కొందరికి మాత్రం నిరాశ తప్పడం లేదు. తాను పవిత్రస్నానం కోసం గంగలో మునిగి పైకి లేచేసరికే తమ వారు కనిపించకుండా పోయారని ఆ తడి బట్టలతోనే భూలా, భట్కా క్యాంప్ కు వచ్చి ఎదురు చూస్తున్నానని ఒక యువతి వాపోయింది. తమ వారికోసం పదేపదే అనౌన్స్ మెంట్లు చేసినా ఇప్పటి వరకూ వారు రాలేదని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. కట్టుబట్టలతో మిగిలిపోయానని, ఒక్క రూపాయి కూడా చేతిలో లేదని ఆమె వాపోయింది. ఇక్కడికే వచ్చిన మరో యువతిది కూడా ఇలాంటి గాధే.. ఇప్పటికి కొన్ని వందల సార్లు మైకులో అనౌన్స్ చేశారని కానీ తమవారెవరూ రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తాము నలుగురు జట్టుగా వచ్చామని.. ఈ రద్దీలో విడిపోయామని మళ్లి తిరిగి కలసి ఊరెళ్లెదెలా అని ఆమె బాధపడింది.
ఇలాంటి రెండు, మూడు సంఘటనలను మినహాయిస్తే మహాకుంభమేళాలో మిస్సింగ్ పర్సన్స్ ని ట్రేస్ చేసి అప్పగించే విధానం, క్రౌడ్ మేనేజ్ మెంట్ చేస్తున్న తీరు మాత్రం భవిష్యత్తులో మరే ఇతర మహా ఉత్సవానికైనా ట్రెండ్ సెట్టింగ్ గా నిలుస్తాయి.