పాకిస్థాన్ సైన్యానికి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్న బలూచిస్థాన్లో రీసెంట్గా జరిగిన దాడుల్లో ఏకంగా 18 మంది పాక్ సైనికులు మృతి చెందారు. కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో సైన్యాన్ని తరలిస్తున్న వాహనాలను ఉగ్రవాదులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిపిన కాల్పుల్లో 18 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో పాక్ సైన్యం ఈ స్థాయిలో మృతి చెందడం ఇదే తొలిసారని చెప్పాలి. మొత్తం 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు. అయితే తాము జరిపిన కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 30కు చేరినట్టు తెలుస్తోంది.
అయితే కొన్నాళ్లుగా బలూచిస్థాన్లో పాక్ సైన్యం అరాచకాలు చేస్తోందంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరిలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన బాంబు దాడుల్లో ఆరుగురు పాక్ సైనికులు మృతి చెందారు. ఇతర ప్రావిన్స్ల నుంచి వచ్చిన ప్రజలను కూడా ఈ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. అంతేకాదు చైనా ఫండింగ్తో నడుస్తున్న అనేక ప్రాజెక్టులను కూడా టార్గెట్ చేసుకుంటున్నాయి. తమ ప్రాంత ఖనిజాలను దోచుకెళుతున్నారంటూ మండిపడుతోంది BLA.
గతేడాది నవంబర్లో క్వెట్టాలోని ఓ రైల్వే స్టేషన్ను పేల్చేసింది BLA. ఇందులో 26 మంది మృతి చెందగా.. అందులో 14 మంది పాక్ సైనికులున్నారు. అంతకుముందు జరిపిన దాడుల్లో 39 మంది మరణించారు. బలూచిస్థాన్, ఖైబర్ ఫక్తూన్లో గత కొన్ని నెలలుగా హింసాత్మక దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2024లో 383 పాక్ సైనికులు మృతి చెందారు. పాక్ సైన్యం కూడా 925 మంది మిలిటెంట్లను మట్టుపెట్టింది.