పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు అదానీ ఆంశం ఉభయసభలను కుదిపేసింది. ఈరోజు(సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. ముందుగా ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్కడ్ బుధవారానికి వాయిదా వేశారు. ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి..యుఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో ఎన్ డిఏ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సన్నద్దమయ్యాయి.