ప్రభుత్వంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. సర్కారు తీరును ఆక్షేపిస్తోంది. ఎక్కడ అవకాశం దొరికినా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉంటోంది. ఈక్రమంలోనే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు.. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను కలిసి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి సభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని కోరారు. తెలంగాణ శాసనసభ కార్యవిధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పులపై శాసనసభను, తెలంగాణ ప్రజలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్కు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఆర్బీఆర్ఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం రూ.389 లక్షల కోట్లు అని స్ఫష్టం చేయగా.. ప్రభుత్వం మాత్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆరోపించారు. అప్పులపై ఆర్ధిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని, ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ”హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” పేరుతో విడుదల చేసిన నివేదిక తేటతెల్లం చేసిందని చెప్పారు. 2014-15లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం రుణాలు రూ.72,658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ.3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించిందన్నారు. ఆర్ధిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. తెలంగాణ శాసనసభ కార్యవిధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని చెప్పారు.
ఆ తర్వాత అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటం వల్లే తాము సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామమన్నారు కేటీఆర్. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తే అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అడ్మిట్ చేశారని, ఆ నోటీసు చర్చకు వచ్చిందన్నారు. స్పీకర్కు ప్రోటోకాల్ సమస్యలు వివరించామన్నారు. లగచర్లపై సభలో చర్చించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశామన్నారు. బీఏసీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ఆర్ధిక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నామన్నారు.