ఏటీఎంల్లో మాయమాటలతో డెబిట్ కార్డులను అపహరిస్తున్న చోరాగ్రేసుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ, ఏపీలో ఖాతాదారులను ఏమార్చి డెబిట్ కార్డుల్ని దొంగిలించి.. ఖాతాల్లో లక్షలకు లక్షలు కొల్లగొట్టిన ఈ దొంగను పట్టుకుని 78 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తస్కరాసురుడి నుంచి రూ.2లక్షల నగదు రికవరీ చేశారు. ఏసీపీ బంగార్రాజు తెలిపిన వివరాల ప్రకారం, సింగ్ నగర్ వాంబే కాలనీకి చెందిన చింతల సురేష్ బాబు ఏటీఎంల వద్ద మకాం వేస్తాడు. వృద్ధులను టార్గెట్ చేస్తాడు. ఏటీఎంకు వచ్చిన వృద్దులు, మహిళలతో మాయ మాటలు ఒరిజినల్ ఏటీఎం కార్డులను తీసుకుని, డూప్లికేట్ కార్డులు ఇస్తాడు. తరువాత ఒరిజినల్ కార్డుతో డబ్బులను డ్రా చేసుకుని కరో జల్సా అంటూ వెళ్లిపోతాడు.
భలే దొరికాడబ్బా..
2017 నుంచి ఏటీఎంల్లో అమాయకుల డెబిట్ కార్డులు కొల్లగొడుతున్న ఈ సురేష్.. ఎట్టకేలకూ పోలీసులకు చిక్కాడు. గత నెల 21న కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని భాస్కరరావుపేట ఎస్.బి.ఐ ఎటీఎం వద్ద డబ్బులు తీసుకునే క్రమంలో ఒక వ్యక్తి వచ్చి తన కార్డు ఏటీఎంలో పెట్టి నగదు రావడం లేదని అడగ్గా… పక్కనే ఉన్న బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సురేష్ సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోగ డెబిట్ కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకుని సురేష్ చెక్కేశాడు.
ఆ వ్యక్తి బ్యాంకులో ఫిర్యాదు చేసి అనంతరం అర్జెంటు పని మీద ఊరు వెళ్లాడు. ఈ నెల మూడవ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నేర స్థలాన్ని పరిశీలించి సాంకేతిక ఆధారాలతో అనుమానితుడిని గుర్తించారు. కృష్ణలంక క్రైమ్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో సురేష్ ను పట్టుకున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో నిందితుడిపై 25 పైగా కేసులు నమోదు కాగ, సురేష్ ను పట్టుకున్న కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఎస్ ఎస్వీ నాగరాజు, ఎస్సై ఏ సూర్యనారాయణ, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, ఎం విజయ సారథి నాయక్ ను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.