29.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

పాతికేళ్ల ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించండి – సీఎం రేవంత్‌

రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని అన్నారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం హైదరాబాద్ జల మండలి బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోర్డు సమావేశమవటం ఇదే తొలిసారి. బోర్డు ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండబ్ల్యుఎస్ ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న జనాభాకు సరిపడే తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మొత్తం 9800 కిలోమీటర్ల డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తున్నట్లు సీఎంకు అధికారులు నివేదించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి సిటీకి ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోందని, గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని తెచ్చుకొని ఉస్మాన్ సాగ‌ర్ , హిమాయత్ సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది.

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకోవాలా, కొండపోచమ్మ సాగర్ ను నీటి వనరుగా ఎంచుకోవాలా.. అనే అంశంపై సమావేశంలో చర్చించారు. కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టుతో పాటు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తెచ్చుకునేలా మార్పులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జలమండలి ఆదాయ వ్యయాల నివేదికను ఎండీ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. జలమండలికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు, తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని వివరించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి దాదాపు రూ. 4,300 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయని, కరెంటు బిల్లులకు జలమండలి దాదాపు రూ.5,500 కోట్లు బాకీ పడిందని, రూ.1,847 కోట్లు గతంలో తీసుకున్న అప్పులున్నాయని, దాదాపు రూ. 8,800 కోట్ల రెవిన్యూ లోటు ఉందని వివరించారు. ఆదాయ వ్యయాలు ఆశాజనకంగా లేవని, వీటిని అధిగమించేందుకు ఆర్థిక శాఖ సమన్వయంతో తక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికే 20 వేల లీటర్ల నీటిని సిటీలో ఉచితంగా సరఫరా చేస్తున్నందున, ఇతర కనెక్షన్ల నుంచి రావాల్సిన నల్లా బిల్లు బకాయిలు క్రమం తప్పకుండా వసూలయ్యేలా చూడాలని అన్నారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయించాలని చెప్పారు.

మంజీరా నుంచి 1965 నుంచి సిటీలో పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పైపు లైన్లకు కాలం చెల్లిందని, దీంతో రిపేర్లు వస్తే దాదాపు పది నుంచి 15 రోజులు నీటి సరఫరా నిలిచిపోతోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పాత లైను వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com