తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా రెండు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేసింది. అలాగే, పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా హోదా పెంచింది. ఇక, మరికొన్ని ఇప్పటికే అయిన మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేసింది. వాటి వివరాలు చూద్దాం…
తెలంగాణలో కొత్తగా మహబూబ్నగర్, మంచిర్యాల మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఆయా జిల్లాల్లోని పలు గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. వాటిలో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, నారాయణపేట జిల్లాలోని మద్దూర్, ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మెయినాబాద్ గ్రామాలను ఇకపై మున్సిపాలిటీలుగా హోదా పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇప్పటికే మున్సిపాలిటీలుగా మారిన వాటిలో ఆ సమీపంలోని పలు గ్రామాలను విలీనం చేసింది. పరిగి మున్సిపాలిటీలో మరో ఆరు గ్రామాలు, నర్సంపేటలో ఏడు గ్రామాలు, నార్సింగిలో ఒక గ్రామం, శంషాబాద్లో మరో గ్రామం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో ఆరు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో వెల్లడించారు.