హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్ టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. సభ్యుల ఆమోదంతోనే ఈ అంశంపై సిట్ విచారణకు ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు కోరడం అభినందనీయమని రేవంత్ వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ టెండర్లను ఎన్నికల సమయంలో హడావిడిగా, అప్పనంగా కొందరు అనుయాయులకు తక్కువ ధరకు కట్టబెట్టారని సీఎం ఆరోపించారు. నిబంధనలు లేకుండా, అనాలోచితంగా కట్టబెట్టడంపై మండిపడ్డారు. దేశం విడిచి పారిపోవాలనే ఉద్దేశ్యంతోనే బీఆర్ఎస్ నేతలు ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఔటర్ రింగ్రోడ్ టెండర్ల లీజు వ్యవహారంపై సిట్ విచారణ సాగిస్తుందని, త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తామన్నారు.
అయితే, ఔటర్ రింగ్రోడ్ టెండర్లపై విచారణకు ఆదేశించడంపై తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు స్పష్టం చేశారు. టెండర్లపై తాను విచారణ కోరలేదని, అయినప్పటికీ సిట్ విచారణను స్వాగతిస్తున్నామన్నారు. ముందుగా టెండర్లను రద్దుచేసి విచారణకు ఆదేశించాలని హరీష్రావు కోరారు.