పార్లమెంటు సాక్షిగా విపక్షాల అనైక్య బాట
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ఉంటే దాదాసాహెబ్ అంబేద్కర్ మనసు ఎంత క్షోభ పడేదో కదా? రాజ్యాంగ స్రుష్టికర్త భవిష్య తరాలకు ఓ రాజకీయ మైలేజీని పెంచే నాయకుడుగా మిగిలిపోతాడని ఎవరైనా ఊహించారా? రాజ్యాంగ రచనకు 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా బడుగుల చైతన్య స్ఫూర్తి పై పట్టు కోసం యుద్ధం మొదలైంది. నిండు సభలో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తిరగబడ్డాయి.. అంబేద్కర్ దళితుల ఆశాజ్యోతి కాబట్టి కాంగ్రెస్ నేతలంతా నీలిరంగు దుస్తులతో పార్లమెంటుకు వచ్చి నిరసన తెలిపారు. చేతిలో ఆయన ప్లకార్డు పట్టుకుని నినాదాలు చేశారు.జై భీమ్.. అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ నినదించారు.దీనికి పోటీగా బీజేపి కూడా అంబేద్కర్ ఫోటో చేతబూని నిరసన ప్రదర్శనతో వారికి ఎదురొచ్చింది. రెండు పార్టీలు పార్లమెంటులో మకర ద్వార్ దగ్గర ఎదురు పడ్డాయి.
ఇరువురి మధ్య తోపులాట..
రెండు పార్టీలు చాలా సేపు పోటా పోటీలతో నినాదాలిచ్చారు. చివరకు కాంగ్రెస్ నేత రాహుల్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే పార్లమెంటు లోకి వెళుతుండగా బీజేపి నేతలు అడ్డుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో రాహుల్ బీజేపి నేత ప్రతాప్ చంద్ర సారంగీ పై పడ్డారు.. ఆయన కింద పడటంతో తలకు గాయమైంది. రాహుల్ తన మీద పడ్డారని ఆయనంటుంటే.. తనను, మల్లికార్జునఖర్గేను బీజేపి నేతలు నెట్టడం వల్లే తాను పడాల్సివచ్చిందని రాహుల్ అన్నారు.పార్లమెంటు ప్రవేశ ద్వారం అందరిదీ.. సభ్యులందరికీ ఇందులోకి వెళ్లే హక్కుందని రాహుల్ కామెంట్ చేశారు.
ఇండీ కూటమిలో అనైక్యత..
హోం మంత్రి అమిత్ షా రాజీనామా డిమాండ్ చేయడంలోనూ ఇండీ కూటమిలో అనైక్యతే.. నిన్న టిఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయగా ఇవాళ కాంగ్రెస్అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభా హక్కుల నోటీస్ ఇచ్చారు.. ఇలా కూటమిలో కీలక పక్షాలైన కాంగ్రెస్, త్రుణమూల్ ఎవరికి వారు వేర్వేరుగా పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, అభివ్రుద్ధి కోసం, పాటుపడిన నేత. ఆయనపై పార్టీ లన్నింటికి ఉన్నది ఈ అభిప్రాయం కాదా? మరెందుకు ఉమ్మడి పోరాటానికి బదులు ఎవరి పోరాటం వారు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా, నిర్ణయాలను వ్యతిరేకించాలన్నా విపక్షాలు ఐక్యంగా ఉంటేనే కదా సాధించేది? మన రాజ్యాంగం కూడా అదే చెబుతోంది కదా.. పార్లమెంటులో బలా బలాల ఆధారంగానే కదా నిర్ణయాల సమీక్ష, ఉపసంహరణ జరిగేది.. కానీ ఇండియా కూటమి నేతలు మాత్రం ఎవరికి వారు అంబేద్కర్ పై విడి విడిగా పోరాటాలు చేస్తున్నారు.