ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఆమె వ్యవహార శైలిపై సీనియర్ నాయకులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం చేయాల్సిన షర్మిల.. కేవలం తన అన్న జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఈ మేరకు షర్మిల తన కుటుంబం, వ్యక్తిగత వివాదాల వరకే పరిమితమయ్యారని సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ మీట్లలో మాట్లాడిన తీరు స్పష్టంగా అర్థంమవుతోందంటున్నారు.
పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు సర్కార్పై చేసిన విమర్శల కంటే జగన్ పై చేసిన ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయని మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ డైరెక్టు షర్మిలను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు.
జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఆమె కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అన్నయ్య మీదే ఆమె టార్గెట్. అతనిపై విమర్శలు చేస్తే చాలు. పార్టీ, రాష్ట్రం ఎలా పోయినా అనవసరం’ అంటూ తనదైన స్టైల్ లో సెటైర్స్ వేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తుంటారు
కానీ ఏపీలో మాత్రం స్వయానా పీసీసీ చీఫ్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం సరికాదని, ఇలా చేస్తే కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమని అన్నారు.