అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ల సదస్సులో పౌర సరఫరాల శాఖ సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పిడిఎస్ రైస్ రీసైక్లింగ్ అవుతూ పెద్దఎత్తున స్మగ్లింగ్ జరుగుతోందని అన్నారు. ఈ అక్రమ వ్యవహారానికి వేదికగా కాకినాడ పోర్టు నిలిచిందన్నారు. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది భాగస్వామ్యులు ఉన్నారని తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యక్రమాలను నియంత్రించేందుకు అవసరమైతే పిడి యాక్టును కూడా వినియోగించాలని అధికారులకు సూచించారు. నియంత్రణ బాధ్యత జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలపై ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ పిడిఎస్ రైస్ ను ప్రజలు తినడానికి ఇష్టపడని పక్షంలో.. వారు ఇష్టపడే రకాన్ని రైతులు సాగు చేసేలా అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు.
- Advertisement with us -