తైవాన్పై మరోసారి దూకుడు పెంచింది డ్రాగన్ కంట్రీ చైనా. ప్రతీ మూడు, నాలుగు నెలలకు ఒకసారి డ్రాగన్ కంట్రీ తైవాన్ చుట్టూ తన బలగాలను మోహరిస్తూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో తమ బలగాలు మోహరించింది చైనా. 30 ఏళ్లలో ఇలాంటి సైనిక చర్యలు ఎప్పడూ చూడలేదని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో.. తైవాన్ కూడా సైనిక కార్యకలాపాలను పెంచింది.
నిజానికి మిలటరీ డ్రిల్స్ అంటూ మొదలుపెట్టినా… అవి యుద్దానికి కాలుదువ్వుతున్నట్లే ఉన్నాయి. ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అనే భయం తైవాన్లో కనిపిస్తోంది. అయితే తన చర్యలను చైనా సమర్థించుకుంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకొంటామని ఎప్పుడూ చెప్పే డైలాగే చెప్పింది. అంతేకాదు వేర్పాటువాద కార్యకలాపాలను సహించేదే లేదని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈసారి ఏకంగా తైవాన్ వేర్పాటువాదులు చైనా శత్రుదేశాలతో చేతులు కలుపుతున్నారని ఆరోపించింది. ఈ విషయంలో తాము చాలా అప్రమత్తంగా ఉంటామని తేల్చి చెప్పింది. చైనాలో తైవాన్ కూడా అంతర్గత భాగమే అని మరోసారి పరోక్షంగా చెప్పేసింది.
రీసెంట్గా తైవాన్ అధ్యక్షుడు అమెరికాలోని హవాయి, గువామ్లో పర్యటించారు. ఈ పర్యటన చైనాకు కోపం తెప్పించిందనే చెప్పాలి. దీంతో తైవాన్ చుట్టుపక్కల తమ బలగాలను మోహరించింది. అయితే అమెరికాలో ఏర్పాటవుతున్న కొత్త ప్రభుత్వానికి సంకేతాలు పంపడానికి చైనా తమ దేశం చుట్టూ సైనిక విన్యాసాలు చేస్తుందన్నది తైవాన్ వాదన. అంతేకాదు ట్రంప్ ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలంటే వెళ్లి అమెరికాలో విన్యాసాలు చేస్తే మంచిదంటూ తైవాన్ ఆర్మీ అధికారులు సెటైర్లు వేస్తున్నారు.