ఇన్నాళ్లు కాదంటూ.. లేదంటూ.. అసలు అలాంటివి జరగలేదంటూ బుకాయించిన బంగ్లాదేశ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకుంది. తమ దేశంలో మైనారిటీలపై ఎలాంటి దాడులు జరగలేదంటూ ప్రపంచానికి చెబుతూ వస్తున్న ఆ దేశ పెద్దలు బహిరంగంగానే దాడులు జరిగాయంటూ నిజాన్ని అంగీకరించారు. ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగాయని లెక్క తేల్చింది. ఈ హింసాత్మక సంఘటనల వెనుక ఉన్న 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.
నిజానికి బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందూవులపై గత కొంత కాలంగా దాడులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం రకరకాల కారణాలు చూపిస్తూ హిందూ నేతలు, వారికి సహకరించేవారిపై కేసులు మోపి జైళ్లకు పంపుతుంది. మహ్మద్ యూనస్ సారధ్యంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవలే భారత్ నుంచి భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తన బృందంతో బంగ్లాదేశ్కు వెళ్లి యూనస్తో చర్చలు కూడా జరిపారు. కానీ అదే సమయంలో హిందూ నేతలపై మరికొన్ని కేసులు నమోదు చేసింది అక్కడి ప్రభుత్వం. హిందువులపై జరుగుతున్న హింసను ఆపేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వస్తుంది.
మరోవైపు బంగ్లాదేశీ హిందువులపై జరుగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత సునీల్ స్పందించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట వినకపోతే.. మరో మార్గాన్ని వెతకాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్కు ఆయన కీలక సూచనలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చర్చలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని తాను ఆశిస్తున్నానని.. ఒకవేళ అలా జరగకపోతే మరో పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందంటున్నారు సునీల్.