ఏసీబీని చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. కూటమి సర్కారు ఏసీబీని పంజరంలో బంధించిందని, బోను నుంచి ఏసీబీని విడుదల చేసి స్వేచ్ఛగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదానీ వ్యవహారంలో అంతర్జాతీయస్థాయిలో విచారణలు జరుగుతుంటే ఏపీలో ఎందుకు రివ్యూ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో అదానీ, వైఎస్ జగన్ మధ్య సోలార్ ఒప్పందాలు జరిగాయని వాటిపై అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెట్టాయని ఆరోపించారు. మరి.. చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
సోలార్ పవర్ డీల్ గురించి అంతర్జాతీయ సంస్థలే ఆధారాలు బయటపెడితే మన నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయా? అని షర్మిల ప్రశ్నించారు. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఏపీలో సోలార్ డీల్పై హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. మరి.. ఆ విషయం ఇప్పుడు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉన్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.