పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చనిపోయిన అల్లు అర్జున్ అభిమాని రేవతి కుటుంబానికి అండగా ఉంటామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో దిల్షుక్నగర్కు చెందిన రేవతి చనిపోగా, ఆమె కుమారుడు వెంటిలెటర్పై చికిత్స పొందుతున్నాడు. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్లో ట్వీట్ చేసింది. ‘నిన్న రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాం. ఆ కుటుంబం, చికిత్స పొందుతున్న కుర్రాడి గురించే మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి, సాధ్యమైనంత వరకూ అన్నివిధాలుగా సహాయాన్ని అందిస్తాం’’ అని పేర్కొంది. మరోవైపు, అల్లు అర్జున్ టీమ్ కూడా ఈ ఘటనపై స్పందించింది. ‘‘నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం’’ అని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది.
అటు.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి జరుగుతున్న చికిత్సపై ఇవాళ ఉదయం బన్నీ వాసు వాకబు చేశారు.ఆసుపత్రికి వెళ్లిన బన్నీవాసు.. బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా బాలుడిని ప్రాణాపాయం నుంచి తప్పించాలని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.