తెలంగాణలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేంద్రాలకి (AICRP) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ICAR PJTAU ఉపకులపతికి నిన్న అధికారికంగా లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పత్తి పరిశోధన చేసే సమన్వయ కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది. ఫలితంగా గత పది ఏళ్లలో జాతీయస్థాయిలో పత్తి పరిశోధన వ్యవస్థలో PJTAU భాగస్వామి కాలేకపోయింది.
ఇటీవల నూతనంగా నియమితులైన ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య గత నెలలో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.టి. పి శర్మ లను కలిసి తెలంగాణలో పత్తి పంట ప్రాధాన్యతను వివరించి వెంటనే అఖిలభారత పత్తి సమన్వయ పరిశోధన పరిశోధన పథకంలో PJTAU కు భాగస్వామ్యం కల్పించి తదనుగుణంగా వరంగల్ లో ఒక ప్రధాన కేంద్రం, ఆదిలాబాద్ లో ఒక ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దానితోపాటు ఆయా కేంద్రాలకు ICAR సిబ్బందిని, నిధులను కేటాయించి PJTAU లో పత్తి పంటలపై పరిశోధనలను పునః ప్రారంభించి రైతులకు రాగల రోజులలో సాంకేతిక మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
ఈ విజ్ఞప్తికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ మరియు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించి కేంద్రాలని వెంటనే మంజూరు చేస్తున్నట్లు నిన్న అధికారికంగా సమాచారం అందిస్తూ లేఖను ఉపకులపతి కి పంపించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రెండు AICRP కేంద్రాలలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య తెలిపారు.