తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో శ్రీనివాసుని భక్తులు మరణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో నిన్న రాత్రి తొక్కిసలాట జరిగిందని, శ్రీవారి భక్తులు చనిపోయారన్న విషయం తెలుసుకున్న జగన్.. ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దేవదేవుని సన్నిధిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనానికి ఇచ్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు వైఎస్ జగన్. అక్కడి పరిస్థితులు చక్కదిద్దేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. తిరుమల ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇంతమంది భక్తులు చనిపోవడం ఆలయ చరిత్రలో తొలిసారి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు గతంలో చిన్న చిన్న సంఘటనలు, అప్పుడప్పుడూ తొక్కిసలాటలు జరిగినిఆ.. ఇలాంటి సంఘటనలు మాత్రం చోటు చేసుకోలేదని అన్నారు.
మరోవైపు.. తొక్కిసలాటలో గాయపడ్డవాళ్లను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం తిరుమలకు వెళ్తున్నారు.