- టీడీపీలో జోగి సెగ
- జోగికి, పార్ధసారధికి ఏంటి లింక్
- జోగి ఎఫెక్ట్ తో బాబుకు క్షమాపణలు చెప్పిన మంత్రి పార్ధసారధి
రాజకీయాల్లో అప్పుడప్పుడు కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగింది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏదో ఒక రాజకీయ పార్టీ వారే నిర్వహిస్తారు. దానికి ప్రత్యర్ధిపక్ష నేతలు దూరంగా ఉంటారు. కావాలంటే ఆ పార్టీ నేతలు వేరుగా వేరే సమయంలో కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసుకుంటారు. కానీ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రస్తుత టీడీపీ మంత్రి పార్ధసారధి, టీడీపీ సీనియర్ నేత, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి ఒకే వాహనం పై ఊరేగింపుగా వెళ్లారు. కలిసి వేదిక పంచుకున్నారు. అసలే ఈ జోగి రమేష్ పై చంద్రబాబు, లోకేష్ కు పీకల వరకు కోపం ఉంది. గతంలో జోగి చంద్రబాబు ఇంటి పై దాడికి వెళ్లి నానా రచ్చ చేసిన విషయాన్ని చంద్రబాబు ఎలా మర్చిపోతారు. జోగి ఈ హడావిడి చేసి తమ పార్టీ అధినేత జగన్ గుడ్ లుక్స్ లో పడ్డారని, దాని ఫలితంగానే ఆయనకు మంత్రి పదవి వరించిందన్న చర్చ వైసీపీ వర్గాల్లో అప్పుడే నడిచింది. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉంటే చంద్రబాబు, లోకేష్ జోగి విషయాన్ని లైట్ తీసుకోలేరుగా. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసు పెట్టారు. లోకేష్ టార్గెట్ నేతల్లో జోగి ఒకరు అన్న చర్చ టీడీపీ సర్కిల్స్ లో తిరుగుతూనే ఉంది. పెడనలో ల్యాండ్ స్కామ్ లో జోగి కుమారుడిని నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మంత్రి పార్ధసారధికి జోగితో రాసుకుని పూసుకుని తిరగాల్సిన అవసరం ఏం వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అధిష్టానం మనసులో ఏం ఉందో తెలిసి కూడా పార్ధసారధి జోగితో కలిసి ఊరేగింపు చేయటం, వేదిక పంచుకోవటం వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుందని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారం తమ దృష్టిలో పడగానే టీడీపీ అధిష్టానం అగ్గిమీద గుగ్గిలం అయ్యిందట. పార్ధసారధి, గౌతు శిరీషకు ఓ రేంజ్ లో లోకేష్ క్లాస్ తీసుకున్నారని టాక్. 2019 లో పార్ధసారధి ప్రాతినిధ్యం వహించిన పెనమలూరు నియోజకవర్గం నుంచే మొన్నటి ఎన్నికల్లో జోగి వైసీపీ తరపున పోటీ చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ ని వదిలి సైకిల్ ఎక్కిన పార్ధసారధి నూజివీడుకు వలస వెళ్లారు. బీసీ కార్డ్ కోటాలో ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా…నాయకులు అన్న తర్వాత తెర వెనుక నడిపే వ్యవహారాలు వేరుగా ఉంటాయిగా.
ఆ సంగతులు ఎలా ఉన్నా…టీడీపీ శ్రేణులు ఆగ్రహం, హైకమాండ్ సీరియస్ అయ్యేటప్పటికి మంత్రి పార్థసారధి జోగితో పాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జోగితో వ్యవహారం అంటే ఇలానే ఉంటుందని వైసీపీ శ్రేణులు కూడా సెటైర్లు వేస్తున్నాయి.