- కాకినాడ సెజ్ లో బిగ్ షాట్లు బాగుపడ్డారని బాబుకు లేఖ
- భూములు కోల్పోయిన బీసీలకు న్యాయం చెయ్యమని లేఖలో డిమాండ్
- చంద్రబాబుకు రాసిన లేఖలో కులాల ప్రస్తావన చేసిన యనమల
కాకినాడ సెజ్ విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖ టీడీపీలో ప్రకంపలనలు సృష్టిస్తోంది. ప్రధానంగా కులాలను ప్రస్తావిస్తూ యనమల వ్రాసిన ఆ లేఖ పట్ల పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ప్రవర్తనలో వచ్చిన మార్పులపై ఆగ్రహం చెందే యనమల ఈ విధంగా లేఖ రాసి ఉంటారని టీడపీలో పలువురు అసంతృప్త నేతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా కాకినాడ సెజ్ ను అడ్డుపెట్టుకుని బడా పారిశ్రామిక వేత్తలందరూ బాగుపడిపోతున్నారు… సెజ్ కు భూములిచ్చిన బీసీలు ముఖ్యంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబుకు రాసిన లేఖలో యనమల పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని యనమ లేఖ రాయడం మంచి విషయమే అయినా ఆలేఖలో వాడిన బాష మాత్రం చాలా అభ్యంతర కరంగా ఉందని దేశం తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేఖలో యనమల ఏం రాశారంటే… కాకినాడ సెజ్ కోసం చిన్న సన్నకారు బీసీ రైతుల నుంచి మత్స్యకారుల నుంచి కాకినాడ పోర్టుకు చెందిన కేవీరావు చౌదరి చెందిన బడా కంపెనీలు అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. కేవీరావు చౌదరి నుంచి వందల కోట్లకు జీఎంఆర్ (వైశ్య సమాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఎత్తి చూపుతూ) కొనుగోలు చేశారని అలాగే అరబిందో (అరబిందో వాళ్ళను జగన్మోహనరెడ్డి బినామీగా కోట్ చేశారు) నాలుగు వేల కోట్లకు కొన్నారని, అదేవిధంగా 500 ఎకరాలు దివీస్ మురళీ చౌదరి కొనుగోలు చేసినట్ల కులాలను ఉటంకిస్తూ యనమల లేఖ రాశారు.
బీసీలను ముంచి కాకినాడ సెజ్ లో విపరీతంగా లబ్దిపొందిన కంపెనీలు ఇవేనని కానీ భూములు కోల్పోవడమే కాకుండా సముద్ర కాలుష్యం, వాయు కాలుష్యాలతో అక్కడి బీసీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో ప్రస్తావించారు. కాకినాడ సెజ్ కోసం పదివేల ఎకరాలు కోల్పోయిన బీసీ రైతులు, మత్స్యకారుల సమస్యలు ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వాలు పరిష్కరించలేదని బాబుకు రాసిన లేఖలో ఎత్తి చూపారు. పర్యావరణ కలుషితం కారణంగా ఉపాధి కోల్పోయిన బీసీ వర్గాల కోసం చెన్నైలోని ఎన్జీటీ, సీయంఎస్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలతో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖలు రాశానని అయితే వీరి చర్యలు తీసుకోవడమనేది పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలా వద్దా అన్నది ప్రభుత్వాల చేతుల్లోనే ఉందని లేఖలో ప్రస్తావించారు.
అసలు భూ సేకరణ అనేది చట్టం స్పూర్తికి విరుద్దమని కాకినాడ సెజ్ జరిగిన భూసేకరణపై ఈడీతో సమగ్ర విచారణ జరిపించాలని యనమల తన లేఖలో చంద్రబాబును కోరారు. కాకినాడ సెజ్ ద్వారా వేల కోట్లు సంపాదించిన కేవీరావు సైతం బాధితులకు న్యాయం చెయ్యలేదని ప్రజాస్వామ్య వ్యవస్ధలో ధనికులు బాగుపడుతుంటే బలహీన వర్గాలు రాజకీయలు, అభివృద్ధి పేరుతో నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఉన్న లూప్ హోల్స్ అడ్డంపెట్టుకుని కేవీరావు వేల కోట్లు సంపాదించాడని ఇటువంటి బిగ్ షాట్ల బారి నుంచి బీసీ, మత్స్యకార రైతులను రక్షించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడమని లేఖలో అభ్యర్ధించారు.
లేఖలో చివరిగా… ఒక రాజకీయ శాస్త్రవేత్త అన్నట్లుగా అంటూ ’’డబ్బు అనేక పనులు చేస్తుంది… కానీ పేదరికం ఏమీ చెయ్యలేదు అని ఒక కొటేషన్ రాశారు యనమల. ఈ విధంగా యనమ చంద్రబాబుకు లేఖ రాయడాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువ కాలం పదవులు అనుభవించింది యనమలే. ప్రస్తుతం కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉండా కుమార్తె, వియ్యంకుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాగే వియ్యంకుడి మరో కుమారుడు పుట్టా హరీష్ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. ఇలా కుటుంబంలో ఇన్ని పదవులు ఉంటే ఇంకా ఏం పదవులు కావాలని యనమల ఇంత పాయింట్ బ్లాంక్ లో చంద్రబాబుకు లేఖరాసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దేశం శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.