రంగారెడ్డి జిల్లా కుంట్లూరు లోని నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు బయట పడ్డాయి. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే, కూరగాయలు కూడా ఆరోగ్యకరంగా కనిపించలేదు. కుళ్లి పోయిన టమాటోలు, ఆలుగడ్డ లతో పాటు ఇతర కూరగాయలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అంతేకాదు.. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక, కిచెన్లో ఈగలు, బొద్దింకలు తిరుగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఇక్కడ వండిన వంటకాలను నిర్వాహకులు నారాయణ విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్ లో విద్యార్థులకు వడ్డిస్తున్నట్లు సిబ్బంది బదులిచ్చారు. మరోవైపు.. అసలు లైసెన్స్ అనేది లేకుండా తొమ్మిది వాహనాలలో భోజనాలను నారాయణ విద్యాసంస్థలకు ఈ కిచెన్ నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో, నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు.