- ఎంపిక చేసినవారినే టార్గెట్ చేస్తున్నారా…?
- జస్టిస్ అందరికీ సమానంగా ఉండాలి కదా…!
- ఎక్స్ వేదికగా పోలీసులను నిలదీసిన ఐఏఎస్ స్మితా సభర్వాల్
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయిన ఫొటోని దాదాపు రెండు వేల మంది షేర్ చేశారని… నాకు ఇచ్చినట్లే వారందరికీ నోటీసులు ఇస్తున్నారా అని తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తన ఎక్స్ ఖాతాలో గచ్చిబౌలి పోలీసులను నిలదీశారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సభార్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన నోటీలకు స్పందించి ఆమె శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీసులు స్మితా సభర్వాల్ స్టేట్మెంట్ని రికార్డు చేసుకున్నారు. అనంతరం ఈ విషయంపై స్మితా సభర్వాల్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరై పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా అని పోస్ట్ చేశారు. తానకు తానుగా ఎలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని, హాయ్ హైదరాబాద్ ఖాతా పోస్ట్ చేసిన దాన్ని తాను రీట్వీట్ చేశానని పేర్కొన్నారు. అయితే ఇదే పోస్టును రెండు వేల మంది షేర్ చేశారని వారందరితో ఇలాగే వ్యవహరిస్తారా అని ఎక్స్ వేదికగా గచ్చిబౌలి పోలీసులను స్మితా సభర్వాల్ నిలదీశారు. ఒకవేళ ఆ రెండు వేల మందికి నోటీసులు ఇవ్వకపోతే కొంత మందినే టార్గెట్ చేసినట్లు అవుతుందని, అప్పుడు సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా వ్యవహరించినట్లవుందన్నారు. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలని అలాకాకుండా ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు.