- కేంద్రం చేతికి బీసీ రిజర్వేషన్ల బిల్లు
- రాజ్యాంగ సవరణ చేస్తేనే బిల్లు అమలు
- కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న రాష్ట్ర ప్రభుత్వం
- మైనార్టీలను చేర్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యంతరం
- తమిళనాడు తరహాలో వెసులుబాటు ఇవ్వాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.. 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభ, శాసన మండలిలో కూడా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. ఇక్కడ వరకు పరవాలేదు కానీ నెక్స్ట్ ఏంటి అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 42 శాతం , విద్య ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం శాసన మండల్లో కూడా ఆమోదం లభించిన నేపథ్యంలో బిల్లును ఆమోదం కోసం గవర్నర్ కి పంపించనున్నారు. రాజ్యాంగపరమైన అంశం కావడం చేత ఇది కచ్చితంగా రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపిస్తారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి..
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతాన్ని మించకూడదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 (సి) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లుల్లో పేర్కొంది. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం.. బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్-9లో చేరి, వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతం దాటిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తుంది.. ఆ రాష్ట్రానికి ఇచ్చిన వెసులుబాటును తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరుతుంది.
నిజానికి 2017లో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు 37% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది.. అప్పటి గవర్నర్ దీనిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపించింది.. ప్రస్తుతానికి ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది… అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత న్యాయపరమైన చిక్కులు రాకుండా 2017 లో చేసిన బిల్లును ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది.
బీసీల రిజర్వేషన్ అంశం కొన్ని రాష్ట్రాల్లో బిజెపికి కీలకంగా మారింది. బీహార్ లో ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీపై ఒత్తిడి ఉంది. అయితే 42% బి సి రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులో మైనార్టీలు కూడా ఉండడం చేత కేంద్రం దీని పట్ల ఆసక్తి చూపే అవకాశం లేదని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గతంలోనే ప్రకటించారు.
మైనార్టీల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్న నేపథ్యంలో… తెలంగాణ పంపించే బిల్లు విషయానికి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందని విషయం ఆసక్తిగా మారింది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై ఒత్తిడి తెచ్చేందుకు అట్లపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు.. ఈ మేరకు ప్రధానమంత్రి కి లేక కూడా రాశారు రేవంత్ రెడ్డి…
అసెంబ్లీలో అయితే బిల్లు ఆమోదం పొందిన కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేయాలంటే అన్ని పార్టీల మద్దతు అవసరం.. వివిధ రాష్ట్రాల్లో తమకున్న రాజకీయపారమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ దీనికి మద్దతు ఇస్తుందని అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… కేంద్రం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అందుకోసమే బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం సహకరించట్లేదు అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉంది..