బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు వేగవంతం చేశారు. నిజానికి ఉక్రెయిన్కు సైనిక సాయం ఆపేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు ట్రంప్. ఇదే జరిగితే ఉక్రెయిన్ ఇక యుద్ధం చేయలేదు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొత్త రూట్ను వెతుక్కున్నారు. యూరోపియన్ యూనియన్కు ప్రత్యేక సైనిక కూటమి ఏర్పాటు అవసరం అంటున్నారు ఆయన. నిజానికి NATOలో చేరే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఈయూ దేశాలను రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నారు జెలెన్ స్కీ. నిజానికి ఆయన వ్యూహాలు ఫలిస్తున్నట్టుగానే ఉన్నాయి.
అవసరమైతే ఉక్రెయిన్కు తమ సైనిక బలగాలు వెళతాయి.. ఈ వ్యాఖ్యలు చేసింది మరేవరో కాదు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. తమ బలగాలను ఉక్రెయిన్కు పంపేందుకు సద్ధమవుతునట్లు ఆయన తెలిపారు. బ్రిటన్, యూరప్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యామని ఆయన చెబుతున్నారు. అంతేకాదు ఉక్రెయిన్కు సహాయం చేయడం తమ బాధ్యత అంటున్నారు ఆయన. అంతేకాదు త్వరలో స్టార్మర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఈయూ దేశాలన్ని ఉక్రెయిన్ విషయంలో చర్చించేందుకు సమావేశం అయ్యేందుకు రెడీ అయ్యారు. నిజానికి దీనికి కారణం జెలెన్ స్కీ. ఇప్పుడు యుద్ధాన్ని ఆపేస్తే రష్యా ఇక్కడితో ఆగదని.. మొత్తం యూరప్ను తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈయూ దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో ఏకం కావాలని చూస్తున్నాయి. అయితే రష్యా మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాలు.. వారి ఆధీనంలోనే ఉండాలని చెబుతోంది. జెలెన్ స్కీ మాత్రం దీనికి అంగీకరించేది లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కలా మారింది. యుద్ధం చేసేందుకు సత్తా లేదు. ఎవరి అండతో, ప్రోద్బలంతో అయితే యుద్ధంలోకి దిగిందో.. ఆ అమెరికా ఇప్పుడు మొఖం చాటేసేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉక్రెయిన్ది. అందుకే ఇప్పుడు ఈయూ దేశాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.