తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడిపై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చ కుడు రంగరాజన్పై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. చిలుకూరు అర్చకుడు రంగరాజన్పై దాడిచేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రంగరాజన్పై దాడిచేసిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన వీర రాఘవ రెడ్డిగా గుర్తించారు. వీర రాఘవ రెడ్డి తాను స్థాపించిన రామరాజ్యం సంస్థలో సభ్యులను చేర్పించాలని, తమకు ఆర్థిక సాయం చేయాలని రంగ రాజన్ను డిమాండ్ చేయగా, దానికి ఆయన నిరాకరించారు. దీంతో, వీర రాఘవ రెడ్డి, ఆయనతో వచ్చిన అనుచరులు చిలుకూరు అర్చుకుడు రంగరాజన్పై దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నా మని, అరెస్ట్ అయిన వారిలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారిని గుర్తించా మన్నారు. తాము స్థాపించిన రామరాజ్యంలో సభ్యులను చేర్పించడంతో పాటు.. తమ సంస్థకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు వీరరాఘవరెడ్డి రంగరాజన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, రంగరాజన్ దీనికి
నిరాకరించడంతో అనుచరులతో కలిసి వచ్చి దాడికి పాల్పడినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో పోలీసులు మొత్తం 22 మందిని గుర్తించారు. వారిలో 17 మంది నిందితుల ఆచూకీ తెలిసిందన్నారు. వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వాళ్లు 17 మంది ఉన్నారని డీసీపీ చెప్పారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అందరినీ అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ఏపీకి చెందిన వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించారు. తాను స్థాపించిన రామరాజ్యం సంస్థను బలోపేతం చేసేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రామరాజ్యంలో చేరిన వారికి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు. ఇందులో చేరిన వారికి నెలవారీగా రూ.20వేల జీతం ఇస్తానని సభ్యులకు వివరించి వారికి నియమ నిబంధనల గురించి వివరించారు. ఇటీవల తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించి రామ రాజ్యం విధి విధానాల గురించి సభ్యులకు హితబోధ చేశారు. ప్రత్యేకంగా రామరాజ్యంలో చేరిన వారికి డ్రెస్కోడ్ ఉండాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన యాప్రాల్లో రామరాజ్యం సభ్యులంతా సమావేశమయ్యారు. రామరాజ్యంలో సభ్యులుగా ఉన్నవాళ్లందరూ తమ సంస్థ బ్యానర్ పెట్టుకొని ఫొటోలు, వీడియోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.
ఇక, ఈ నెల 7వ తేదీన రామరాజ్యం సభ్యులు దాదాపు 25 మంది బృందం.. వీరరాఘవరెడ్డి నాయకత్వంలో ప్రత్యేకంగా నల్లదుస్తులు ధరించి చిలుకూరు ఆలయం సమీపంలోని అర్చకుడు రంగరాజన్ నివాసానికి వెళ్లారు. వాళ్ల ఇంట్లోనే రంగరాజన్ను భయభ్రాంతులకు గురిచేశారు. శుక్రవారం ఉదయం వీళ్లంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. వీరరాఘవరెడ్డి తదితరులు చిలుకూరు బాలాజీ దేవాలయం బాధ్యతలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకో బోయిన రంగరాజన్ కుమారుడిని సైతం కొట్టారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ను ప్రశ్నించారు. ఊరికే కోర్టుల్లో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు గడువు ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే ఇక తాము రాబోమని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు.
2040 నాటికి రామరాజ్యం ఏర్పాటు చేస్తానని వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరి ట ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేశాడు. అదే పేరుతో వెబ్సైట్ కూడా ప్రారంభించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరుగుతూ రామరాజ్య స్థాపనపై ప్రచారం చేస్తున్నాడు. తనకు 5వేల మంది సైన్యం కావాలని ప్రకటన జారీ చేశాడు. తన సైన్యంలో చేరేవారికి భగవద్గీత వచ్చి ఉండాలని, ఐదు కిలోమీటర్లు నడవ గలగాలని, రెండు కిలోమీటర్లు పరుగెత్త గలగాలని నియమాలు పెట్టాడు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా వీర రాఘవ రెడ్డి పనిచేశాడు. జైహింద్, జై విశ్వ మానవ వేదిక పేరుతో 2016లో ఓ గ్రూపును సైతం ఏర్పాటు చేశాడు. తర్వాత దాన్ని మూసివేసి గోరక్షణ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాడు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు సైన్యాన్ని వాడుకున్నాడు. 2015లో అబిడ్స్ పోలీస్ స్టేషన్లో వీరరాఘవరెడ్డిపై ఓ కేసు కూడా నమోదైంది. గత కొంత కాలంగా వీరరాఘవరెడ్డి మణికొండలో నివాసం ఉంటున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.