తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ఇటీవల బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా, జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్ లో అనుబంధ సంఘాల ఛైర్మన్లు, అధ్యక్షులతో ఇవాళ ఆమె భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యమైన అంశాల గురించి మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పనితీరు నివేదకలను ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటి ? అనేది తనకు తెలుసునని చెప్పారు. పని చేస్తుంది ఎవరు..? యాక్టింగ్ చేస్తుంది ఎవరు..? అనేది కూడా తనకు తెలుసని అన్నారు. కీలక నేతలు పార్టీ కోసం సమయం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో ఏం నడుస్తున్నా.. అంతర్గత విషయాలు బయట చర్చ చేయొద్దని హెచ్చరించారు. పార్టీ అంతర్గత సమాచారం బయటకు తెలిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఒకవేళ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తన పనితీరు నచ్చకపోయినా… రాహుల్ గాంధీకి లేదా సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పుకొచ్చారు. కానీ. బయట మాత్రం పార్టీ అంతర్గత విషయాలు మాట్లొడద్దని తెలంగాణ ఏఐసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలను హెచ్చరించారు.