- ముందగా సెంట్రల్ వర్శిటీ విద్యార్థులను పరామర్శించండి
- తెలంగాలణలో రాజ్యాంగ హక్కులు కాలరాస్తుంటే మౌనంగా ఉన్నారెందుకు
- ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత
మోసపూరిగ హామీలు అబద్దపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నడానికి హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత తన ఎక్స్ ఖాతాలో పలు అంశాలపై నిలదీశారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అని ఎద్దేవా చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చాక ముందుగా లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ వర్శిటీ విద్యార్ధులను పరామర్శించాలని కవిత డిమాండ్ చేశారు. 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రాచి రంపాన పెట్టిందని, హైడ్రా, మూసీ పేరుతో ప్రజల మీదకు బుల్డోజర్లు పంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని, అడ్డుపడ్డ బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమీషన్ కూడా నిర్ధారించిందని తెలిపారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు.. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని, ప్రియాంకా గాంధీని, రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని కవిత ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. బిహార్ లో గ్రూప్ -1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని… మీ మౌనం దేనికి సంకేతం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తన ఎక్స్ ఖాతాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు.