తెలుగునాట 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రీజినల్ పార్టీలు తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి మాత్రమే అని అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా 1200 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యంతో సభ జరుపుతామన్నారు. మార్చి 28వ తేదీ సభ జరుపుకోవడానికి అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు పెట్టామని కేటీఆర్ తెలిపారు. అలాగే 3వేల ఆర్టీసీ బస్సుల కోసం కూడా ఆర్టీసీకి విజ్క్షప్తి చేస్తే సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుందన్నారు. బహిరంగ సభ తరువాత విద్యార్థులు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామన్నారు. డిజిటల్ పద్దతిలో జరిగే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. అన్ని కమిటీలు వేయడం పూర్తయ్యాక జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి నెలా ఒక్కో కార్యక్రమం సిల్వర్ జూబ్లీ సంవత్సరం 12 నెలెలు కొనసాగేలా ప్రణాళికను సిద్దం చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని, ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని కేటీఆర్ చెప్పారు.