ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఒంగోలులో దేవాదాయ శాఖకి చెందిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఒంగోలులో దేవాదాయ శాఖ భవనం నిర్మించామని చెప్పారు. దేవాదాయ శాఖకు సంబంధించి ప్రతి జిల్లాలో సొంత భవనం ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంకల్పం అని మంత్రి తెలిపారు. ఈ మధ్యనే నెల్లూరులో ఒక కార్యాలయం ప్రారంభించామని త్వరలో తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయంతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నామని మంత్రి ఆనం ప్రకటించారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన అన్ని హామీలను దాదాపు నెరవేర్చామని ఆనం పేర్కొన్నారు. ధూపదీప నైవేద్యాల కింద ఇచ్చే నిధులు గత ప్రభుత్వ హయాంలో 5వేల రూపాయలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పది వేల రూపాయలను దాదాపు 5600 దేవాలయాలకు ఇవ్వడం జరుగుతోందని మంత్రి వివరించారు. మరో మూడు వందల ఆలయాల నుంచి కూడా ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇవ్వమని ప్రతిపాదనలు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. సీజీఎఫ్ పధకం కింద ఆలయాల పునరుద్ధరణ కొరకు నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయాల అభివృద్ధికి, ధూప దీప నైవేద్యాలకు నిధులు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఆనం చెప్పారు. ఆలయాల్లో ఉన్న అర్చకులకు 15వేల రూపాయలు, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 20వేల రూపాయలు ఇచ్చేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. దేవాదాయ శాఖలో ప్రక్షాళన ప్రారంభమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
- Advertisement with us -